భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టులో మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓలీ పోప్ (106) రన్స్ చేయగా.. హ్యారీ బ్రూక్ 99 పరుగులకు అవుటై.. త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్ (40), క్రిస్ వోక్స్ (38) కూడా ఆఖర్లో రాణించడంతో ఇంగ్లాండ్.. భారత స్కోరుకు చాలా దగ్గరకు వచ్చింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ ఆలౌట్తోనే అంపైర్లు టీ విరామం ప్రకటించారు. మూడో సెషన్లో మళ్లీ భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.
మూడో రోజు ఆటను 209/3 స్కోర్తో ప్రారంభించిన ఇంగ్లాండ్.. భోజన విరామ సమయానికి 327/5తో నిలిచింది. రెండో రోజు సెంచరీ చేసిన ఓలీ పోప్ (106; 131 బంతుల్లో 13×4) ఆట మొదలైన కాసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (20; 52 బంతుల్లో 3 ఫోర్లు) నిలకడగా ఆడినా, క్రీజులో పాతుకుపోతున్న అతడిని సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (99; 112 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులు) వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాది 65 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి జేమీ స్మిత్ (40; 45 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ అభేద్యమైన ఆరో వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, స్మిత్ ఆరో వికెట్గా ఔట్ కాగా, ఆ తర్వాత హ్యారీ బ్రూక్ను కూడా ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు.
అయినా.. చివర్లో క్రిస్ వోక్స్ (38), బ్రైడన్ కార్సే (22) రాణించారు. వీరు 8వ వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ భారత్ స్కోరుకు దగ్గరయ్యింది. చివరకు, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి అదరగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ 3, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తన ఆఖరి 7 వికెట్లను కేవలం 41 పరుగులకే కోల్పోగా, మరోవైపు ఇంగ్లాండ్ టెయిలెండర్లు రాణించడం విశేషం. బుమ్రా బౌలింగ్లో ఏకంగా 4 క్యాచ్లు జారవిడవడం పెద్ద దెబ్బ తీసింది. ఇందులో 3 క్యాచ్ల్ని జైస్వాల్ పట్టుకోలేకపోయాడు. జడేజా మరో క్యాచ్ జారవిడిచాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్.. 471 రన్స్కు ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఘనంగా ఆరంభించిన టీమ్ఇండియా.. రెండో రోజు పట్టు విడిచింది. ఒక దశలో 550-600 స్కోరు చేసేలా కనిపించిన భారత్.. 500 లోపే చాపచుట్టేసింది. శనివారం రిషబ్ పంత్ (134; 178 బంతుల్లో 12×4, 6×6) అద్భుత శతకంతో భారీ స్కోరుకు బాటలు పరిచినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారత్ అనుకున్న దాని కంటే తక్కువ స్కోరే చేసింది.
మరోవైపు ఈ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయటం ద్వారా బుమ్రా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. విదేశాల్లో జరిగిన టెస్టులలో భారత్ తరుఫున అత్యధిక సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్గా బుమ్రా నిలిచాడు. 34 టెస్టు మ్యాచ్లలో బుమ్రా 12 సార్లు ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో కపిల్ దేవ్ ఉన్నారు. కపిల్ దేవ్ 66 టెస్టులలో 12 సార్లు 5 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ 9 సార్లు, జహీర్ ఖాన్ 8 సార్లు విదేశాల్లో ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa