ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి పంకజ్ అగ్రహారికి గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన బండా జిల్లాలో ఓ మహిళతో పెళ్లయింది. అయితే మొదట్లో బాగానే ఉన్న ఆమె తర్వాత తర్వాత తన అసలు రూపాన్ని భర్తకు పరిచయం చేసింది. ముఖ్యంగా ఆమె ప్రవర్తన చాలా వింతగా తోచగా.. ఆమె గురించి తెలుసుకోవాలనుకున్నాడు భర్త. ఈక్రమంలోనే ఆమె సొంతూరుకు వెళ్లగా.. షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఆమెకు ఇది వరకే నాలుగు పెళ్లిళ్లు జరిగాయని.. అందులో మూడు ఫతేపూర్ జిల్లాలోనే జరిగినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. తాను ఐదో భర్తనని తెలుసుకుని వాపోయాడు.
ముఖ్యంగా మొదటి నలుగురి వద్ద కూడా మంచిదానిలా నటించి పెళ్లి చేసుకున్న ఈమె.. వారి వద్ద నుంచి డబ్బు, నగలు తీసుకుని పరారైనట్లు గుర్తించాడు. అయితే పెళ్లైన తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అత్తమామలు సహా భర్తను వేధిస్తూ నరకం చూపించేది. తరచుగా గొడవలు పెట్టుకుని డబ్బు, నగలు గుంజేది. చివరకు అవన్నీ తీసుకుని పుట్టింటికి వచ్చేసేది. ఆమె టార్చర్ భరించలేని భర్తలు కూడా మహిళ వదిలేయగానే.. దరిద్రం పోయిందనుకుని చేతులు దులుపుకునే వాళ్లు. దీంతో ఈమె ఆగడాలు కొనసాగాయి. అచ్చంగా ఐదో భర్త వద్ద కూడా ఇలాగే చేసింది. అత్త, మామలు సహా కట్టుకున్న వాడిని చిత్ర హింసలు పెట్టింది.
రోజూ గొడవలు పెడుతూ.. ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఎప్పటిలాగే డబ్బు, నగలతో వెళ్లిపోవాలనుకుంది. ఇదంతా బాగానే ఉండగా.. భర్త పంకజ్ అగ్రహారి తమ్ముడితో ఈ కిలేడీ ప్రేమలో పడింది. మనస్ఫూర్తిగా అతడిని ప్రేమించింది. అతడికి కూడా ఈమె నచ్చగా.. ఇద్దరూ కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. అందుకోసం ఇంటి నుంచి పారిపోవాలనుకున్నారు. దీంతో ఆమె డబ్బు, నగలు తీసుకుని అతడితో పరారైంది. ఈ విషయం గుర్తించిన భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. భార్యే తనను మోసం చేసి తన తమ్ముడితో వెళ్లిపోయిందని చెప్పాడు. పెళ్లయిన తర్వాత తన భార్య చుక్కలు చూపించిందని, ఇంట్లో ఏ ఒక్కరికీ ప్రశాంతత లేకుండా చేసిందని వాపోయాడు. అలాగే ఇంట్లోని వస్తువులు, నగలు, డబ్బును తన తల్లిదండ్రులకు పంపేదని ఆరోపించాడు.
అంతేకాకుండా అప్పుడప్పుడు బయటి వ్యక్తులను ఇంటికి తీసుకొచ్చి తనపై దాడి చేయించిందని, తనను, తన తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వకుండా చేసిందని వివరించాడు. చివరకు తన తమ్ముడినే ప్రేమలో పడేసి వెంట తీసుకెళ్లిపోయిందని వివరించాడు. అలాగే తనకు ఇది వరకే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని, తనకు అవేమీ చెప్పకుండానే వివాహం చేసుకుందని పేర్కొన్నాడు. ఇలా తనను మోసం చేసిన మహిళను ఎలాగైనా సరే పట్టుకుని తన డబ్బు, నగలు తనకు ఇప్పించాని కోరాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎక్కడుందో గుర్తించే పనిలో పడ్డారు.
అయితే తాజాగా దీనిపై రాధానగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ దినేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉన్నతాధికారులకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు అందిందని.. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa