ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి ప్రాంతంలో రెండో భూ సమీకరణకు వచ్చేనెలలో నోటిఫికేషన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 01:19 PM

 రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనికిగాను జూలైలోగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ భూ సమీకరణకు 2015నాటి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం నిబంధనలు ఉంటాయని, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు-2025ను సీఆర్‌డీఏ నోటిఫై చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. రాజధానిలో భూసమీకరణ కింద తీసుకున్న 34 వేల ఎకరాలు ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే హైదరాబాద్‌ తరహాలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, హోటళ్లు, టూరిజం, క్రీడానగరం, స్మార్ట్‌ పరిశ్రమలు అవసరమని తెలిపారు. వీటివల్ల జీఎస్టీ పెరుగుతుందని, సమాంతరంగా అమరావతి అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఇందుకోసం కనీసం 10 వేల ఎకరాలు కావాల్సి ఉందన్నారు. సంబంధిత నిబంధనలను సీఆర్‌డీఏ నోటిఫై చేసి, విధి విధానాలు ఖరారు చేసి, జూలైలోగా నోటిఫికేషన్‌ ఇస్తుందన్నారు. 29 గ్రామాలను ఆనుకుని జాతీయ రహదారికి తూర్పువైపు, కృష్ణానదికి ఇవతల ఉత్తర ప్రాంతం, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు పడమర వైపు ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూ సమీకరణ చేపడతామన్నారు. దీనిపై గ్రామ కమిటీల ద్వారా తీర్మానాలు చేపడతామని, ఎమ్మెల్యేలు, కలెక్టర్లుకు సూచనలు చేశామని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa