ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమర్జెన్సీ నాటి భయానక పరిస్థితులను ఏ భారతీయుడూ అంత తేలికగా మరచిపోలేరని ప్రధాని పునరుద్ఘాటించారు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 01:22 PM

భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, ఆ రోజులను ఏ భారతీయుడూ మరిచిపోలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజును దేశ ప్రజలతో పాటు తాము కూడా 'సంవిధాన్ హత్యా దివస్'గా పరిగణిస్తున్నామని తెలిపారు.ఎమర్జెన్సీ కాలంలో నాటి పాలకులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పూర్తిగా పక్కనపెట్టారని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రాథమిక హక్కులను కాలరాశారని, పత్రికా స్వేచ్ఛను దారుణంగా అణచివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, చివరికి సామాన్య పౌరులను కూడా అన్యాయంగా జైళ్లలో నిర్బంధించారని ఆరోపించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే అరెస్టు చేసినట్లుగా అనిపించిందని మోదీ వ్యాఖ్యానించారు.ఎమర్జెన్సీ నాటి భయానక పరిస్థితులను ఏ భారతీయుడూ అంత తేలికగా మరచిపోలేరని ప్రధాని పునరుద్ఘాటించారు. ఆ దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మొక్కవోని దీక్షతో పోరాటం చేశారని గుర్తుచేశారు. వారి అలుపెరగని పోరాటం వల్లే చివరికి ఎమర్జెన్సీని ఎత్తివేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మరింత బలోపేతం చేస్తామని, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోదీ తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల కలలను సాకారం చేయడమే తమ ధ్యేయమని అన్నారు.ఈ సందర్భంగా, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 'ది ఎమర్జెన్సీ డైరీస్' పేరుతో తాను ఒక పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా తన ప్రస్థానం, ఎమర్జెన్సీ రోజుల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు, తన అనుభవాలను ఆ పుస్తకంలో వివరంగా పొందుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పుస్తకం ద్వారా నాటి చీకటి రోజులకు సంబంధించిన అనేక తెలియని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa