మెక్సికోలో మరోమారు తుపాకులు గర్జించాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో నగరంలో గత రాత్రి జరిగిన వీధి వేడుకల్లో దుండగులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది వరకు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. సెయింట్ జాన్ బాప్టిస్ట్ గౌరవార్థం స్థానికులు నృత్యాలు చేస్తూ, పానీయాలు సేవిస్తూ ఆనందంగా గడుపుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.స్థానికులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న వేళ ఒక్కసారిగా తుపాకుల శబ్దాలు వినిపించడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. ఆన్లైన్లో షేర్ అవుతున్న వీడియోలలో కాల్పులు ప్రారంభం కాగానే వేడుకలో పాల్గొన్నవారు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక హౌసింగ్ కాంప్లెక్స్ ఆవరణలో బ్యాండ్ వాయిస్తుండగా ప్రజలు నృత్యం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.కాల్పుల ఘటనను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆమె తెలిపారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ నేర ముఠాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గ్వానాజువాటో రాష్ట్రం అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో ఒకటిగా మారింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే రాష్ట్రంలో 1,435 హత్యలు నమోదయ్యాయి. గత నెలలో శాన్ బార్టోలో డి బెరియోస్లో ఒక కేథలిక్ చర్చి కార్యక్రమంలో జరిగిన దాడిలో ఏడుగురు మరణించారు. తాజా ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa