ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య,,,ఏపీలో తొలిసారిగా.రూ.10 లక్షల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 07:31 PM

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. మనదేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం కొవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడింది. కరోనా కారణంగా పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎందరో. అయితే కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మిషన్ వాత్సల్య -PM కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద అలాంటి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందింది.


కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన తూర్పుగోదావరి జిల్లా వాసికి మిషన్ వాత్సల్య -PM కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ చెక్కును అందించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సుమామణికి మిషన్ వాత్సల్య - పీఎం బాలల సంరక్షణన యోజన - పీఎం కేర్ కింద రూ.10 లక్షలు అందించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈ చెక్కును సుమామణికి అందజేశారు. ఈ పథకం కింద పిల్లలకు ఆర్థిక సాయం అందించడంతో పాటుగా వారి విద్య, వైద్య సంరక్షణ, ఇతర అవసరాలు చూస్తారు. మిషన్ వాత్సల్య -PM కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద 18 ఏళ్లు పూర్తి చేసుకోవటంతో సుమామణికి రూ.10 లక్షలు చెక్కు అందించారు.


మరోవైపు బాలల కోసం పీఎం కేర్స్ పథకాన్ని 2021 మే 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను లేదా చట్టబద్ధ సంరక్షకులను లేదా దత్తత తీసుకున్న వారిని కోల్పోయిన పిల్లలకు చేయూతనిచ్చేందుకు ఈ పథకం ప్రారంభించారు. కొవిడ్ సమయమైన 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఈ పథకానికి అర్హులు. అలాంటి వారి సమగ్ర సంరక్షణ, భద్రతతోపాటు భోజన, నివాస సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యం. అలాగే ఉపకార వేతనం, విద్యాభ్యాసం ద్వారా సాధికారత కల్పిస్తారు. 18 ఏళ్లు వచ్చేదాకా రూ.10 లక్షల నిధి సమకూరుస్తారు. అలాగే ఆరోగ్య బీమా కూడా ప్రభుత్వం కల్పిస్తుంది.


2020లో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చాలా మంది ఆ మహమ్మారి జ్ఞాపకాల నుంచి తేరుకోలేకపోతున్నారు. ఆ తర్వాత కొవిడ్ మహమ్మారి అనేక రూపాలు మార్చుకుంటోంది. ప్రస్తుతం కూడా అక్కడక్కడా ఒమిక్రాన్ వైరస్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa