ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9మందిని చంపిన కిరాతకుడు,,,,జపాన్ ట్విట్టర్ కిల్లర్‌కు ఉరిశిక్ష అమలు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:52 PM

జపాన్‌లో 2017లో జరిగిన 'ట్విట్టర్ కిల్లర్' ఉదంతం సంచలనం సృష్టించింది. ఓ సైకో కిల్లర్ తన అపార్ట్‌మెంట్‌లో 9మందిని కిరాతకంగా చంపాడు. అనంతరం వారిని మృతదేహాలను ముక్కలుగా కోసి పెట్టెల్లో పెట్టాడు. ఈ ఘటన అప్పట్లో జపాన్‌లో కలకలం రేపింది. ఈ హత్యలు చేయడానికి నేరస్థుడు ట్విట్టర్ ఉపయోగించుకున్నాడు. అందుకే అతడికి ట్విట్టర్ కిల్లర్ అనే పేరు వచ్చింది. తాజాగా అతడికి మరణ శిక్షను అమలు చేశారు.


ఎవరీ 'ట్విట్టర్ కిల్లర్'?


2017లో టోక్యోలోని ఒక అపార్ట్‌మెంట్‌లో 8 మంది మహిళలు, ఒక పురుషుడు అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తకహిరో షిరైషిని అనే వ్యక్తిని విచారించడంతో ఈ దారుణమైన హత్యల విషయం బయటపడింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించే వారిని టార్గెట్ చేసి, 'ట్విట్టర్' ద్వారా వారిని సంప్రదించి, వారికి సహాయం చేస్తానని చెప్పి ఈ హత్యలకు పాల్పడ్డట్లు నేరస్థుడు వివారణలో తెలిపాడు.


తకహిరో షిరైషి విచారణలో విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. తాను హత్య చేసిన తొమ్మిది మంది.. సోషల్ మీడియా వేదికల్లో పలు మార్లు.. తాము ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు పోస్టులు పెట్టడం తాను గమనించానని తెలిపాడు. అందువల్ల ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో 'ఆత్మహత్య' గురించి పోస్టులు పెట్టేవారిని షిరైషి గుర్తించేవాడు. వారిని సంప్రదించి, "నేను మీకు సహాయం చేస్తాను" అని చెప్పి, తన అపార్ట్‌మెంట్‌కు రప్పించేవాడు. అనంతరం వారిని హత్య చేసేవాడు. అయితే వారు చనిపోవడానికి తాను సహాయం చేశానని చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.


అయితే దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటబడ్డాయి. తన ఇంటికి వచ్చిన 8 మంది మహిళలపై అత్యాచారం చేసి, ఆపై వారిని హత్య చేశాడని పోలీసులు తేల్చారు. చనిపోయిన వారిలో టీనేజ్ అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పారు. హత్య చేసిన తర్వాత వారి శరీరాలను ముక్కలుగా నరికి, బాక్సుల్లో నింపి ఇంట్లోనే దాచుకున్నాడు తకహిరో షిరైషి.


ఇత దారుణమైన హత్యలు చేయడానికి సోషల్ మీడియాను వాడుకున్న తీరు కారణంగా మీడియా అతనికి 'ట్విట్టర్ కిల్లర్' అనే పేరు వచ్చింది. అప్పట్లో ఈ పేరు వైరల్ అయింది. ఈ కేసు విచారణ తర్వాత 2020లో తకహిరో షిరైషికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే జపాన్‌లో మరణశిక్షలు రద్దు చేయాలని కొంతకాలంగా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు గత మూడేళ్లుగా ఉరిశిక్షల అమలును నిలిపివేశారు. అయితే, షిరైషి కేసు అత్యంత దారుణంగా ఉండటంతో, శుక్రవారం ఉదయం అతడిని టోక్యో డిటెన్షన్ హౌస్‌లో ఉరితీశారు. ఈ ఉరిశిక్ష అమలు చేయడం జపాన్‌లో మూడేళ్ల తర్వాత జరిగిన తొలి మరణశిక్ష కావడం గమనార్హం. ఈ ఉదంతం సోషల్ మీడియాలో ఉండే ప్రమాదాల పట్ల, అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa