ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగు అంశాల ఫార్ములాను ప్రతిపాదించిన రాజ్‌నాథ్,,,,భారత్‌-చైనా ఉద్రిక్తతలకు శాశ్వత ముగింపు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:53 PM

భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా చైనాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్‌జున్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు నాలుగు అంశాల ఫార్ములాను చైనా ముందు రాజ్‌‌నాథ్ సింగ్ ఉంచారు. ఈ క్రమంలోనే రెండు దేశాల మంత్రులు తాజాగా చర్చలు జరిపారు.


గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అక్సాయిచిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనాతో భారత్‌కు ఎప్పటికీ తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే చైనాతో ఘర్షణలను పూర్తిగా ముగించేందుకు భారత్ ముందడుగు వేసింది. తాజాగా షాంఘై కో ఆపరేషన్‌ సదస్సులో పాల్గొనేందుకు చైనాలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఇదే పర్యటనలో చైనా రక్షణ మంత్రి అడ్మిరల్‌ డాంగ్‌జున్‌తో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపడటం, కొత్త ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు మంత్రులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ నాలుగు అంశాల ఫార్ములాను ప్రతిపాదించినట్లు సమాచారం.


విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించిన ప్రణాళికలో ఈ నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. 2024లో భారత్ చైనా మధ్య కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉండటం. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు కొనసాగించడం. రెండు దేశాల మధ్య సరిహద్దులను గుర్తించడం, నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం వంటి వాటిని రాజ్‌నాథ్ సూచించినట్లు తెలుస్తోంది.


 


 


ఈ నాలుగు అంశాల ఫార్ములా రెండు దేశాల మధ్య శాంతియుత సహజీవనానికి, సరిహద్దు వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని భారత్ ఆశిస్తోంది. ఈ భేటీ సందర్భంగా పాకిస్తాన్‌ కేంద్రంగా ఉన్న సీమాంతర ఉగ్రవాదం అంశాన్ని కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి చైనా మంత్రికి వివరించారు. చైనా రక్షణమంత్రితో జరిగిన ఈ సమావేశం మంచి ఫలితాలను ఇస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు. 6 ఏళ్ల తర్వాత కైలాస మానససరోవర యాత్రను చైనా మళ్లీ ప్రారంభించడంపై రాజ్‌నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో చైనా మంత్రికి బిహార్‌ ప్రత్యేక మదుబనీ పెయింటింగ్‌ను రాజ్‌నాథ్‌ గిఫ్ట్‌గా అందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa