ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమేనీని చంపడానికి ప్రయత్నించాం.. కానీ.. ఇజ్రాయెల్ మంత్రి సంచలన ప్రకటన

international |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:56 PM

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ వేసిన పథకాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారని అమెరికా ఉన్నతాధికారులు చెప్పినట్టు రాయిటర్స్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. తాజాగా, దీనిని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనే హతమార్చేందుకు ప్రయత్నించాము, కానీ అందుకు అవకాశం రాలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఛానెల్ కాన్ న్యూస్‌తో పాటు చానల్ 12, చానల్ 13లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో ఈ విషయం వెల్లడించారు ఇరాన్ నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉన్నతాధికారి బహిరంగంగా ప్రకటించడం ఇదే మొదటిసారి.


చానల్ 13 ఇంటర్వ్యూలో క్యాట్జ్ మాట్లాడుతూ.. ‘ఖమేనీ మన టార్గెట్‌లో ఉంటే ఖచ్చితంగా మేం చర్య తీసుకునేవాళ్లం.. కానీ మేము ఎంత ప్రయత్నించినా, అతడు బంకర్‌లోకి పారిపోయాడు.. అతడు సైనికాధికారులతో సంబంధాలను తెంచుకున్నాడు. అప్పుడు మాకు ఇది అమలు సాధ్యం కాదు’ అని ఆయన కాన్ ఛానల్‌కు చెప్పారు. ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా ఖమేనీ అంతమైతేనే యుద్దం ఆగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


ట్రంప్ సైతం హెచ్చరికలు


‘ఖమేనీ ఎక్కడ దాగి ఉన్నాడో మాకు బాగా తెలుసు. అతడు మాకు సులువైన టార్గెట్. కానీ ఇప్పటికిప్పుడు అతడ్ని హతమార్చే ఉద్దేశం మాకు లేదు’ అని జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత ‘ప్రస్తుతానికి ఇరాన్‌లో పాలన మార్పు లక్ష్యంగా పెట్టుకోలేదని’ ట్రంప్ స్పష్టం చేశారు.


ఇజ్రాయెల్ రక్షణ మంత్రి క్యాట్జ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మేము ఇరాన్ పాలనను మార్చాలని కాకుండా, ఆపరేషన్ మధ్యలో వారిపై ఒత్తిడి తీసుకురావడమే మా ఉద్దేశం’ అని చెప్పారు. అయితే, ఖమెనీని మాత్రం ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా అధినేత నస్రల్లాతో ఆయన పోల్చారు. ‘ఖమేనీకి నా సలహా ఒకటే ఆయన ఇప్పుడు దాక్కున్నట్టు భూగర్భ బంకర్‌లోనే ఉండటం ఉత్తమం.. బయటికి వస్తే ప్రమాదమే’ అని హెచ్చరించారు. యుద్ధం సమయంలో ఖమేనీ రహస్య బంకర్లలోకి ఇరాన్ సైన్యం తరలించిన సంగతి తెలిసిందే.


కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బయటకు వచ్చిన ఆయతుల్లా ఖమేనీ ‘ఇరాన్ అణు సామర్థ్యం ఏ మాత్రం దెబ్బతినలేదు’ అని స్పష్టం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు జరగని విషయాలను చెబుతున్నారు.. ఈ కల్పిత విజయం ట్రంప్‌కి అవసరమైందేమో’ అని ఎద్దేవా చేశారు. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ గెలిచింది. అమెరికాను గట్టిగా దెబ్బకొట్టి ప్రతీకారం తీర్చుకుంది’ అని ఖమేనీ అన్నారు. ఇరాన్ మిస్సైల్ దాడుల్లో 28 మంది ఇజ్రాయెల్ పౌరులు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 627 మంది ఇరాన్ పౌరులు మరణించారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa