ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో బిగ్ డీల్.. వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ సంకేతాలు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 09:03 PM

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సంకేతాలు ఇచ్చారు. ఈ నెల మొదటి వారంలో అమెరికా, భారత్ మధ్య నలుగురు ప్రతినిధుల బృందాలు నాలుగు రోజుల పాటు గోప్యంగా చర్చలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ ఒప్పందం చేయాలనుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట మీడియా ‘మీతో వాణిజ్య ఒప్పందాలపై ఎవరైనా ఆసక్తి చూపుతున్నారా?’ అని అడిగింది. నిన్ననే చైనాతో ఓ ఒప్పందం చేసుకున్నాం. ఇంకా చాలా గొప్ప ఒప్పందాలు ఉన్నాయి. భారతదేశంతో కూడా రాబోతుంది, బహుశా చాలా పెద్దది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని 'బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్' సభలో అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు.


ట్రంప్ మాట్లాడుతూ... ‘అమెరికా ప్రతి దేశంతో ఒప్పందాలు చేసుకోదని, కొన్నిటికి కేవలం ధన్యవాదాల లేఖ పంపించి 25-45 శాతం టారిఫ్ విధిస్తాం.. అది సులభ మార్గం.. కానీ నా బృందం ఎక్కువ ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తోంది’ అన్నారు. ఇక, భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటూ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్యం అస్త్రాన్ని వాడి ఇరు దేశాల యుద్ధాన్ని ఆపేశానని చెప్పిన విషయం తెలిసిందే.


జూన్ 10న ముగిసిన నాలుగు రోజుల చర్చల్లో, పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ అందుబాటు, టారిఫ్ తగ్గింపులు, నాన్-టారిఫ్ అడ్డంకులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అమెరికా తరఫున వాణిజ్య ప్రతినిధి కార్యాలయం అధికారులు పాల్గొనగా.. భారతదేశం తరఫున రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో చర్చలు సాగాయి. ప్రస్తుతం 190 బిలియన్ల డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయి.


కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరిలో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా, సమతౌల్యంగా ఉండే వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాలు చర్చల్లో ఉన్నాయి’ అని తెలిపారు.


ట్రంప్ అదే సభలో చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందంపై కూడా వ్యాఖ్యానించారు. ‘చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలను వేగంగా రవాణా చేయడానికి ఒప్పందం కుదిరింది’" అని వైట్‌హౌస్ అధికారి వెల్లడించారు. ఈ ఒప్పందం జెనీవా ఒప్పందాన్ని అమలు చేసే మౌలిక రూపకల్పనపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగి ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోవడంతో ఈ ఒప్పందం ప్రధాన పరిష్కారంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 1న లిబరేషన్ డే పేరుతో ప్రతీకార సుంకాలు ప్రకటించి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa