ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మ కోసం పసివాడి తపన.. కలెక్టర్ ఆఫీసుకు వచ్చిన పదేళ్ల బాలుడు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 06:22 PM

సోమవారం ఉదయం.. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం.. వచ్చీపోయే వారితో హడావిడిగా ఉంది. కలెక్టర్ ఆఫీసులో పనుల కోసం వచ్చే వారు కొందరైతే.. కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తూ వచ్చేవారు మరికొందరు.. అలా వచ్చీపోయే వారి మధ్యలో.. భుజానికి స్కూలు బ్యాగ్, భయంగా బెరుకు బెరుకుగా చూపులతో.. చేతిలో పేపర్‌తో ఓ పదేళ్ల బాలుడు. కలెక్టర్ ఆఫీసులోకి అయితే వచ్చాడు కానీ.. ఎటు పోవాలో తెలీదు.. ఎవరిని కలవాలో తెలీదు. తన కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కావడం లేదు. కానీ తన మదిలో ఒకే మాట మెదులుతోంది.. మనం చచ్చిపోదాం బిడ్డా అంటూ అమ్మ చెప్పిన మాట. ఏమీ చేయలేని నిస్సహాయత, కన్నీరుగా మారి.. కళ్లల్లో మెదులుతూ చచ్చిపోదాం బాబూ అంటూ అమ్మ చెప్పిన అదే మాట.. ఆ మాటే ఆ చిన్నారిని కలెక్టర్ ఆఫీసు గడప తొక్కేలా చేసింది. బాధతో అమ్మ చెప్పిన ఆ మాట.. స్కూలుకు వెళ్లాల్సిన పిల్లాడిని.. కలెక్టర్ కార్యాలయానికి రప్పించింది.


యశ్వంత్ వయసు పదేళ్లు.. నాలుగో తరగతి చదువుతున్నాడు. నాన్న లారీలో పనికి వెళ్తుంటాడు. అమ్మ కుటుంబాన్ని పోషించడం కోసం.. గుంటూరు సర్వజన ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి నడుపుతోంది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులు, వారి బంధువులు టిఫిన్ బండి వద్దకు వచ్చి నాలుగు మెతుకులు లోపలికి వేసుకుంటేనే.. వీరికి నాలుగు రాళ్లు మిగులతాయి. యశ్వంత్ కూడా సెలవురోజుల్లో టిఫిన్ బండి వద్ద అమ్మకు సాయం చేస్తుంటాడు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. అధికారుల కళ్లు యశ్వంత్ వాళ్ల టిఫిన్ బండి మీద పడ్డాయి. టిఫిన్ బండి పెట్టుకోవడానికి వీల్లేదన్నాయ్. బలవంతంగా టిఫిన్ బండిని అక్కడి నుంచి ఖాళీ చేయించాయ్.


టిఫిన్ బండి సాయంతో కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్న యశ్వంత్ తల్లి.. ఈ ఘటనతో తల్లడిల్లిపోయింది. తమకు జీవనాధారం ఆ టిఫిన్ బండేనని.. ఆస్పత్రి వద్ద కాస్త స్థలం ఇప్పించండి అయ్యా అంటూ అధికారులను వేడుకుంది. అర్జీలు పెట్టుకుంది. కానీ అధికారుల స్పందన శూన్యం. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. చచ్చిపోదాం బిడ్డా అంటూ ఆ తల్లి తన నిస్సహాయతను కొడుకు వద్ద బయటపెట్టుకుంది. టిఫిన్ బండి వద్ద నలుగురిని నవ్వుతూ పలకరిస్తూ కనిపించే అమ్మ.. అలా బాధతో కన్నీరు పెట్టుకుంటే పాపం ఆ పసివాడు భరించలేకపోయాడు. నాన్నేమో లారీ పని అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇక అమ్మకోసం తానే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు యశ్వంత్..


వేరే వాళ్లు మా టిఫిన్ బండిని ఖాళీ చేసేశారు. కాలువలో పడేశారు. బండి పెట్టనివ్వడం లేదు. ఆఫీసులకు చాలాసార్లు తిరిగాం. వాళ్లూ పెట్టనీయటం లేదు. అందుకోసమే మా అమ్మ కోసం నేను వచ్చా. అమ్మ చచ్చిపోదాం, చచ్చిపోదాం అంటోంది..మా నాన్న పట్టించుకోవడం లేదు. అందుకోసమే నేను వచ్చా. టిఫిన్ బండి పెట్టుకోవడానికి మాకు స్థలం ఇప్పించండి సారూ - యశ్వంత్


సోమవారం ఉదయం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. టిఫిన్ బండి పెట్టుకోవడానికి అనుమతి ఇప్పించండి సారూ.. అంటూ చేతిలో అర్జీతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన యశ్వంత్.. మీడియాకు కనిపించాడు. దీంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓ సగటు మధ్యతరగతి కుటుంబం కష్టాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. యశ్వంత్ అభ్యర్థనపై అధికారులు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ.. అమ్మ కష్టం చూడలేక నాలుగో తరగతి బాలుడు ఇలా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి.. తన గోడును వెళ్లబోసుకున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa