తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు కొలిచే దైవం. జన్మలో ఒక్కసారి అయినా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని ప్రతి హిందువూ కోరుకుంటూ ఉంటాడు. శ్రీవారి క్షణకాల దర్శనం కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తరలి వస్తుంటారు. అలాంటి పవిత్రమైన తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్వెజ్ హోటల్ నిర్మించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. జయ, విజయ విగ్రహాలు, బంగారు వాకిలి, కులశేఖరపడితో శ్రీవారి గర్భాలయ నమూనాతో హోటల్ నిర్మించారు. విశాఖ హైవే వద్ద రాయుడు మిలిటరీ హోటల్లో ఇలా శ్రీవారి గర్భాలయ నమూనా సెట్ వేశారు. అయితే శ్రీవారి గర్భాలయం నమూనా ఏర్పాటు చేసి.. మాంసాహారం వడ్డిస్తూ ఉండటంతో హిందూసంఘాలు, శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.
ఈ విషయమై తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఈ హోటల్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇలా వ్యాపారం కోసంవ వాడుకోవటం దారుణమని కిరణ్ రాయల్ మండిపడుతున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే హోటల్ వద్ద ఆందోళన చేపడతామని కిరణ్ రాయల్ తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. పర్యవేక్షణ కోసం టీటీడీ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని కిరణ్ రాయల్ కోరారు.మరోవైపు తిరుమల శ్రీవారి గర్భాలయం.. ప్రతి హిందువు గుండె లోతుల్లో నిలిచే పవిత్ర స్థలమని.. అలాంటి నమూనాతో హోటల్ నిర్మించి.. ఇలా మాంసాహారం వడ్డించడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.
మరోవైపు శ్రీవారి భక్తుల ఆందోళనపై రాయుడు మిలిటరీ హోటల్ యాజమాన్యం స్పందించింది. తాము శ్రీవారి గర్భాలయం నమూనా ఏర్పాటు చేసినప్పటికీ.. నాన్ వెజ్ వంటకాలు వాటి ఎదురుగా వడ్డించడం లేదని తెలిపింది. శ్రీవారి గర్భాలయం నమూనా ఎదురుగా ఉన్న టేబుల్స్, పక్కనే ఉన్న టేబుళ్లపై కేవలం వెజ్ వంటకాలు మాత్రమే వడ్డిస్తున్నట్లు తెలిపింది.
తిరుమలలో ఎలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో భోజనం చేస్తున్నారో.. అలాంటి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నమూనాతో హోటల్ నిర్మించినట్లు రాయుడు మిలిటరీ హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. టీటీడీకి ఫిర్యాదు చేరిన నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa