తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీటీడీ శ్రీవారి సేవకులను నియమిస్తూ ఉంటుంది. శ్రీవారి భక్తులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవకులుగా సేవ చేసుకునేందుకు ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీవారి సేవకులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక యాప్ రూపొందించాలని నిర్ణయించింది. నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం వృత్తి నైపుణ్య శ్రీవారి సేవపై వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను శ్రీవారి సేవ కోసం ఉపయోగించుకోనున్నట్లు టీటీడీ ఏఈవో వెల్లడించారు. టీటీడీలోని 10 ముఖ్యమైన విభాగాల్లో వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల సేవలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. టీటీడీలోని సాంకేతిక విభాగాల్లోనూ సాంకేతిక నిపుణుల సేవలను ఉపయోగించుకుంటామని వివరించారు.
ప్రతి విభాగంలోనూ అవసరం మేరకు నిపుణులైన శ్రీవారి సేవకుల సేవలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవటం ద్వారా టీటీడీ వ్యవస్థను మెరుగుపరుస్తామని వివరించారు. తొలుత ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేసి.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేస్తామని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
శ్రీనివాసమంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు
మరోవైపు శ్రీనివాసమంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హనుమంత వాహనంపై స్వామి వారు విహరిస్తారు. బుధవారం గరుడ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. జులై మూడో తేదీన పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా టీటీడీ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతోంది,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa