ఇంగ్లాండ్తో తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్లో సెంచరీలు చేశాడు. దీంతో రెండో టెస్టుకు ముందు దృష్టంతా అతడిపై పడింది. రెండో టెస్టులో అతడు ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై చెప్పడంతో సీనియర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్పై అదనపు బాధ్యతలు పడ్డాయి. వాటిని సమర్థవంతంగా పోషిస్తూ తొలి టెస్టులో రాహుల్ సెంచరీ చేశాడు. జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ .. వీరిద్దరిని ఉద్దేశించి మాట్లాడాడు.
“భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన సూపర్ ఫామ్ను తదుపరి టెస్టులోనూ కొనసాగిస్తాడని భావిస్తున్నా. ఒకే టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో సెంచరీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఒక బ్యాటర్ మానసికంగా చాలా ఫిట్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. పంత్ 48 గంటల వ్యవధిలోనే దీన్ని సాధించి.. తానెందుకు ప్రత్యేకమో చాటి చెప్పాడు. ఇంగ్లాండ్ గడ్డపై అతడు రాణించడం బాగుంది. ఇటీవల అతడు సరిగా ఆడలేదు. అతడిలో పరుగుల దాహం ఉంది. తొలి టెస్టులో ఫామ్నే అతడు ఈ సిరీస్ మొత్తం కొనసాగిస్తాడని అనుకుంటున్నా,” అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
“ప్రస్తుతం భారత క్రికెట్కు కేఎల్ రాహుల్ చాలా ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడు. సీనియర్ బ్యాటర్ అయిన అతడు తొలి టెస్టులో అద్భుత సెంచరీ చేశాడు. అతడు కేవలం ఒక్క సెంచరీతోనే ఆగిపోయే రకం కాదు. ఈ సిరీస్లో మరిన్ని శతకాలు కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి వస్తాయి” అని సంజయ్ మంజ్రేకర్ తన మనసులోని మాటను చెప్పాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జులై 2 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టులో మ్యాచ్లో ఓడిపోయిన భారత్.. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa