ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనం చేసిన ఇంట్లోనే మద్యం త్రాగి దొరికిపోయిన దొంగ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 05:36 PM

దొంగలు సాధారణంగా చోరీ చేసి వెంటనే అక్కడి నుంచి ఉడాయిస్తారు. కానీ, ఓ దొంగ మాత్రం తాను కన్నం వేసిన ఇంట్లోనే మూడు రోజుల పాటు మకాం వేసి, చోరీ సొమ్ముతో మద్యం తాగి, చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విచిత్ర సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే, బొబ్బిలి పట్టణానికి చెందిన సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం అలజంగి గ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన ఓ దొంగ, ఇదే అదనుగా భావించి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. గడిచిన మూడు రోజులుగా, ఆ ఇంట్లోనే ఉంటూ తనకు దొరికిన వెండి, ఇత్తడి సామాన్లను కొద్దికొద్దిగా బయటకు తీసుకెళ్లి అమ్ముకున్నాడు.ఆ వచ్చిన డబ్బుతో ప్రతిరోజూ ఫుల్లుగా మద్యం తాగి, రాత్రిపూట మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి హాయిగా నిద్రపోయేవాడు. అయితే, శ్రీనివాసరావు ఇంట్లోంచి అలికిడి రావడం, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని స్థానిక ప్రజలు గమనించారు. వారికి అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంట్లో తనిఖీ చేయగా మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న దొంగను చూసి ఆశ్చర్యపోయారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యజమాని ఊళ్లో లేని సమయంలో దర్జాగా చోరీ చేస్తూ, అదే ఇంట్లో నివాసం ఉన్న ఈ వింత దొంగ గురించి తెలిసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa