పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల అమానవీయ వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భరించలేని వడ్డీ భారం, తీవ్రమైన ఒత్తిడితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చే వరకు నీ భార్య, కుమార్తెను మా ఇంటికి పంపించు అంటూ ఫైనాన్షియర్లు నీచంగా వేధించడంతోనే తాను చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. పుదుచ్చేరికి చెందిన విక్రమ్ (33) అనే యువకుడు చిన్న వ్యాపారం చేసుకుంటూ, ఓ చికెన్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అతడు ఉపాధి కోల్పోయాడు. ఈ క్రమంలో వ్యాపారం కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేకపోయాడు.పోలీసుల కథనం ప్రకారం, విక్రమ్ రూ.3.8 లక్షల అప్పునకు నెలకు రూ.38,000 వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. మరో రూ.30,000 అప్పుకు నెలకు రూ.6,000 వడ్డీ కట్టాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ప్రమాదం తర్వాత విక్రమ్ పనిచేయలేని స్థితిలో ఉండటంతో అప్పుల వాళ్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.మృతుడు విక్రమ్, ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీలో స్థానిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో, తన చావుకు కారణమైన ఫైనాన్షియర్ల పేర్లను ప్రస్తావించాడు. తన భార్యాబిడ్డల బాగోగులు చూసుకోవాలని నటుడు విజయ్ను వేడుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారుల ఆగడాలపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో పుదుచ్చేరి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారాల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. దోషులను కఠినంగా శిక్షించి, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa