కొన్ని ఘటనలు చూస్తుంటే పెళ్లిపై నమ్మకమే పోతుంది. పెళ్లిచేసుకోవాలంటేనే భయపడేలా కొంతమంది క్రూరంగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ రాక్షుసుల్లా ప్రవర్తిస్తున్నారు. కొన్ని కాపురాలు అక్రమ సంబంధాలతో పక్కదారి పడితే.. మరికొన్ని బంధాలను వాళ్లకు వాళ్లే చేతులారా చిదిమేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాస్గంజ్లో 5నెలల గర్భిణి అయిన భార్య పట్ల భర్త అమానుషంగా ప్రవర్తించాడు. కూరలో ఉప్పు ఎక్కువైందని దాడికి పాల్పడ్డాడు. గర్భిణి అని కూడా కనికరం చూపకుండా తన్నుతూ, గుద్దుతూ విచక్షణారహితంగా కొట్టాడు. ఈ క్రూరమైన దాడిలో భార్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మృతురాలి సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. కాస్గంజ్లో రాము – బ్రజ్బాల దంపతులు తమ మూడేళ్ల కొడుకుతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం బ్రజ్బాల వండిన కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త రాము ఆమెపై దాడికి దిగాడు. ఆమె వదిలేయాలని ప్రాదేయపడినా.. అలాగే విచక్షణారహితంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె పైఅంతస్థు నుంచి కిందికి జారి పడింది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో బ్రజ్బాల చికిత్స పొందుతూ మరణించింది. బ్రజ్బాల మరణంపై ఆమె సోదరుడు స్పందించాడు. రాముకు తన వదినతో అక్రమ సంబంధం ఉందని.. ఈ విషయంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్లు ఆరోపించారు. గర్భిణి అని కూడా చూడకుండా తన సోదరిని దారుణంగా చంపేసిన రామును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాము ఇంటి నుంచి పారిపోగా.. గ్రామస్థులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa