ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కత్తితో పొడిచి .. రక్తపు మడుగులో ఉండగానే తాళి కట్టాడు,,, సెల్ఫీలు తీసుకున్నాడు

Crime |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 09:21 PM

ప్రేమ పేరుతో ఒక యువకుడు సృష్టించిన బీభత్సం కర్ణాటకలోని మైసూర్‌లో సంచలనం రేపింది. ప్రేమిస్తున్నానంటూ చాలా రోజులుగా వెంట పడుతున్న అతడికి అమ్మాయి గట్టిగా బుద్ధి చెప్పింది. అది ఏమాత్రం తట్టుకోలేకపోయిన అతడు వెంట ఓ కత్తి తీసుకెళ్లి మరీ ఆమె కడుపులో పొడిచాడు. ఆపై ఆమె స్పృహ తప్పి పడిపోగానే మెడలో తాళి కట్టేశాడు. అది చాలదన్నట్లు సెల్ఫీలు తీసుకుని మురిసిపోయాడు. ఆపై నెమ్మదిగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని పారిపోగా.. చికిత్స పొందతూ యువతి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.


కర్ణాటకలోని పాండవపురానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అదే ప్రాంతానికి చెందిన అభిషేక్ గత కొంత కాలంగా ఆమె వెంట పడుతున్నాడు. నువ్వంటే ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నానంటూ చెప్పి తెగ ఇబ్బంది పెట్టాడు. ప్రతీసారి ఆమె అతడిని తీరు మార్చుకోమని హెచ్చరిస్తూనే వస్తోంది. నువ్వంటే నాకిష్టం లేదని చెబుతూనే ఉంది. కానీ అవేమీ పట్టించుకోని అభిషేక్ మాత్రం నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో మరోసారి తన జోలికి రావొద్దంటూ సదరు యువతి అభిషేక్‌ను గట్టిగా మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గట్టిగా ఆమె కడుపులో పొడిచాడు.


దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్పృహ లేకుండా పడిపోయింది. అయితే అదేమీ పట్టించుకోని అభిషేక్ మాత్రం.. ఆమె రక్తపు మడుగులో ఉండగానే తన వెంట తెచ్చుకున్న తాళి తీసి మెడలో కట్టాడు. ఆపై ఆమెను ఒళ్లోకి తీసుకుని సెల్ఫీలు తీసుకున్నాడు. ఓవైపు రక్తం కారుతున్నా పట్టించుకోకుండా.. తన పిచ్చి ఆనందంతో మురిసిపోయాడు. ఇక చివరకు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉందని.. ఆమె బతకం కష్టం అంటూ వైద్యులు చెప్పారు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన అభిషేక్.. ఆమెను ఆస్పత్రిలోనే వదిలి పెట్టి పారిపోయాడు. కాగా చికిత్స పొందుతున్న యువతి శనివారం రోజు ప్రాణాలు కోల్పోయింది.


దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదంతా చేసింది అభిషేకే అని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన యువతి తల్లిదండ్రులతో పాటు మైసూరు వాసులు అందరినీ కలిచి వేసింది. పట్టపగలే అతడు ఇంత దారుణానికి పాల్పడడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa