ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 14న (సోమవారం) సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన మూడు రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా కేంద్ర జలశక్తి శాఖల మంత్రులను ప్రత్యేకంగా కలవనున్నట్లు తెలిసింది. అలాగే ఇతర శాఖల మంత్రులతోనూ సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యావరణ అనుమతి నిపుణుల మదింపు కమిటీ అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. అలాగే బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలపై కేంద్ర జలసంఘం అనుమతి తీసుకోవాలని సూచించింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసే 200 టీఎంసీల నీటిని వాడుకుని రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 3000 టీఎంసీల గోదావరి వరద జలాలు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని.. ఇందులో 200 టీఎంసీల నీటిని వాడుకునే ఉద్దేశంతో రూ.80 వేల కోట్లతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
అయితే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు వేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తన పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలవనుండటంతో ఇరువురి మధ్య ఈ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa