ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా మరణానికి కారణం ప్రిన్సిపల్.. స్కూలు టీచర్ లేఖలో సంచలన విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 11:19 PM

ప్రిన్సిపల్ వేధిస్తోందంటూ ఓ మహిళా టీచర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది. మైదుకూరు మండలం పనిపెంట గురుకుల పాఠశాలలో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రిన్సిపల్ మేడమ్ వేధింపులు భరించలేకపోతున్నానని.. తన చావుకు ప్రిన్సిపల్ కారణమంటూ లేఖ రాసి ఆమె ఆత్మహత్యకు యత్నించారు. అయితే తోటి టీచర్లు సకాలంలో ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి గల కారణాలను జ్యోతి టీచర్ లేఖలో వివరించారు. ప్రిన్సిపల్ నిర్మల మీద చర్యలు తీసుకోవాలని కోరారు.


" నా పేరు జ్యోతి. వనిపెంట గురుకుల పాఠశాలలో బయాలజీ టీచర్‌ను. 8 ఏళ్ల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగం చేస్తున్నా. జూన్ 2025 నుంచి స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. టార్చర్ చేస్తున్నారు. నాకు మూడు నెలల వయసు గల పాప ఉంది. అయినా నేను అన్ని తరగతులకు హాజరవుతున్నా. నా విధులు నిర్వహిస్తున్నా. నా మరణానికి కారణం ప్రిన్సిపల్ మేడమ్ నిర్మల. బయాలజీ సరిగా చెప్పలేనని నా మీద ప్రిన్సిపల్ నిందలు వేశారు. మరి నేను చెప్పలేనప్పుడు ఎందుకు ఆరు సెక్షన్లు నాకు ఇచ్చారు. స్కూల్లో జరిగే విషయాలను బయటకు చెప్తున్నాననే అనుమానంతో ప్రిన్సిపల్ నన్ను వేధిస్తోంది. నాతో మాట్లాడే నా తోటి ఉపాధ్యాయులను నాకు దూరం చేసింది. నాతో మాట్లాడకుండా ప్రిన్సిపల్ చేసింది. నా స్నేహితులతోనే నాకు మెమో ఇవ్వమని చెప్పి ప్రిన్సిపల్ మేడమ్ నన్ను అవమానపరిచింది. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా" అని జ్యోతి లేఖలో ఆరోపించారు.


"నా మరణం తర్వాత నా కుటుంబానికి, నా పిల్లలకి ప్రిన్సిపల్ నిర్మలదే పూర్తి బాధ్యత. పాఠశాలలో ఇంకా దారుణాలు జరుగుతున్నాయి. అయితే అవన్నీ రాసే శక్తి నాకు లేదు. పాఠశాలలో ప్రిన్సిపాల్‌కు నచ్చని టీచర్లను తొలగిస్తుంది. వారి గురించి లేనిపోని రూమర్స్ సృష్టిస్తుంది.. పిల్లలతో చెడుగా లెటర్స్ రాయిస్తుంది. విచారణకు వచ్చిన అధికారులు కూడా ప్రిన్సిపల్ మాటలనే నిజమని నమ్ముతున్నారు. అందుకే ఏమీ తేల్చకుండా వెళ్లిపోతున్నారు."


"నిజానికి స్కూల్లో జరిగేది ఒకటి బయటకు మాత్రం కనిపించేది ఒకటి. స్కూల్లో ప్రత్యేక వంటలు చేయించుకుని తినటం నిజమే. మా సెక్రెటరీ మేడమ్‌కు, డీఎస్‌ మేడమ్‌కు ఈ విషయాలు తెలియద్దు. ప్రిన్సిపల్ చెప్పే మాటలే నిజమని నమ్ముతున్నారు. ఇప్పటికైనా వారు ప్రిన్సిపల్ నిజస్వరూపం తెలుసుకుంటారని నమ్ముతున్నాను. ఉన్నతాధికారులు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా" అని లేఖ రాసి జ్యోతి ఆత్మహత్యకు యత్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa