ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా, టెక్నాలజీని జోడించి రాష్ట్రంలోనే మొట్టమొదటి 'స్మార్ట్ కిచెన్'ను కడపలో ప్రారంభించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడిస్తూ, ఎంతో థ్రిల్లింగ్ గా ఉందంటూ ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు.కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో ఈ అత్యాధునిక స్మార్ట్ కిచెన్ను ఏర్పాటు చేసినట్లు లోకేశ్ తెలిపారు. దీని ద్వారా కేంద్రీకృత విధానంలో ప్రస్తుతం 12 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2,200 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, వేడివేడి భోజనాన్ని అందిస్తున్నారని వివరించారు.ఈ స్మార్ట్ కిచెన్ ప్రత్యేకత టెక్నాలజీ వినియోగమేనని ఆయన పేర్కొన్నారు. వంట చేసే దగ్గర నుంచి విద్యార్థులకు పంపిణీ చేసే వరకు ప్రతి దశను ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారని చెప్పారు. దీనివల్ల భోజనం నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చని, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా సేకరించడం సులభమవుతుందని అన్నారు.ప్రస్తుతం ఉన్న బడ్జెట్ పరిధిలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండటం విశేషమని లోకేశ్ ప్రశంసించారు. త్వరలోనే మరో నాలుగు స్మార్ట్ కిచెన్లు నిర్మాణ దశ పూర్తి చేసుకోనున్నాయని, ఈ నూతన విధానం ద్వారా పిల్లలకు మరింత గౌరవంగా, జవాబుదారీతనంతో పౌష్టికాహారం అందించవచ్చని తెలిపారు. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ను, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa