తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 మంది అన్య మతస్తులు ఉన్నట్లు, వారిని వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారని, ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో టీటీడీ అధికారులు స్పష్టం చేయాలని మాజీ చైర్మన్, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ టీటీడీపై చేసిన వాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..`కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేసారంటే వారి వద్ద నివేదిక ఉందా? కేంద్ర మంత్రి బండి సంజయ్ పక్కనే టిటిడి పాలకమండలి సభ్యుడు భాణుప్రకాశ్ కూడా ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ మాటల్ని నేను ఆక్షేపిస్తున్నా. ఇది శ్రీవారి ఆలయంపై బండి సంజాయ్ దాడిగా ఆలోచిస్తున్నాం. టిటిడి బోర్డు 22 మంది అన్య మతస్తులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. టిటిడి ఈఓ, చైర్మన్ లు దీనిని ప్రకటించారు. మరి బండి సంజాయ్ 1000 మంది అన్య మతస్తులు ఉన్నట్లు చెప్పడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు. బండి సంజయ్ ప్రకటన ప్రకారం టిటిడి లో 20 శాతం పైగా అన్య మతస్తులే ఉన్నట్టు అర్థం. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు.24 గంటల అయినా ఈ ప్రకటనపై కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ , టిటిడి ఖండిస్తూ ప్రకటన కూడా ఇవ్వలేదు. మరి బండి సంజయ్ చెప్పింది నిజమా?. టిటిడి 22 మంది ఉన్నారని ఎలా ప్రకటించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం, టిటిడిపై ఉంది. టిటిడి ని, టిటిడి ఉద్యోగస్తులను అవమానించడమే.బండి సంజయ్ ప్రకటన వల్ల తిరుపతి ప్రజలు బాధపడుతున్నారు` అని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa