ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవీ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని కితాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 16, 2025, 06:14 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో జరిగిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు' అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ, దేశానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పీవీ నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన దేశానికి అనేక రంగాల్లో సేవలు అందించిన గొప్ప నాయకుడని, ఆయన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి అన్నారు.పీవీ నరసింహారావు ఎన్నో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆర్థిక సంస్కరణలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పీవీ నరసింహారావుదేనని సీఎం స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సవాళ్లను అర్థం చేసుకున్న నాయకుల్లో పీవీ ఒకరని పేర్కొన్నారు. 1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, సరైన విధానాలు లేక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేసుకున్నారు.పీవీ నరసింహారావు తీసుకున్న చర్యల వల్లే దేశంలో ఐటీ విప్లవం ప్రారంభమైందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలాలను ప్రస్తుతం దేశం అనుభవిస్తోందని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరని ఉద్ఘాటించారు. పీవీ 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారని, తద్వారా ఆయన విజ్ఞానం సంపాదించి గొప్పవాడయ్యారని, కానీ ఇప్పుడు కొందరు హిందీ నేర్చుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa