ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకౌంట్లోని డబ్బులు వెనక్కి తీసేసుకుంటున్నారా? క్లారిటీ ఇదే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 07:32 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం తల్లికి వందనం పథకం. బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలని.. పేదరికం చదువుకు అడు కాకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. జూన్ 12వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.13000 జమ చేశారు. తల్లికి వందనం పథకం కింద ఏటా రూ.15000 ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇక హామీని అమలు చేసే క్రమంలో పాఠశాల అభివృద్ధికి రూ.2000 మినహాయించుకుని విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13000 చొప్పున జమ చేశారు.


67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.13000 చొప్పున జమ చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా.. వారందరికీ కూడా తల్లికి వందనం కింద నిధులు అందించారు. అర్హులై ఉండి తొలి జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం.. ఇటీవలే తల్లికి వందనం రెండో జాబితాను ప్రకటించింది. అలాగే జాబితాలోని తల్లుల ఖాతాల్లోకి కూడా 13000 అందించింది. అయితే తల్లికి వందనం పథకం డబ్బులు వెనక్కి తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. బ్యాంక్ ఖాతాల్లోని తల్లికి వందనం డబ్బులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.


"తల్లికి వందనం డబ్బుల్ని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది అని ఈ వ్యక్తి చెబుతున్న విషయం అబద్ధం. మీ ఖాతాలో ఒకసారి జమ చేసిన సొమ్మును ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. కాబట్టి లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన పడనక్కరలేదు. ప్రజలను ఆందోళనకు గురిచేసే ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని చేస్తున్న ఈ వ్యక్తిపై ప్రభుత్వం కేసు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటుంది. ఇటువంటి ఫేక్ పోస్టులను షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఇటువంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి." అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa