భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 23 నుంచి 26 వరకు బ్రిటన్, మాల్దీవుల్లో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగనుంది.బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు మోదీ జులై 23-24 తేదీల్లో యూకేను సందర్శిస్తారు. మోదీ యూకేలో పర్యటించడం ఇది నాలుగోసారి. ఈ సందర్శనలో భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య మరియు ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరుగనున్నాయి. అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అంశాలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ సందర్శనలో భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.జులై 25-26 తేదీల్లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశాన్ని సందర్శిస్తారు. మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇది మూడోసారి. అంతేకాదు, ముయిజ్జు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏ దేశాధినేత లేదా ఏ దేశ ప్రధాని మాల్దీవుల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో మోదీ, మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘గౌరవ అతిథి’గా పాల్గొననున్నారు. 2024 అక్టోబరులో ముయిజ్జు భారత్ పర్యటనలో ఆమోదించిన ‘భారత్-మాల్దీవ్స్ సమగ్ర ఆర్థిక మరియు సముద్ర భద్రతా భాగస్వామ్యం’ అమలు పురోగతిని ఇరు నాయకులు సమీక్షించనున్నారు. ఈ సందర్శన భారత్ ‘నైబర్హుడ్ ఫస్ట్’ (పొరుగు దేశానికి మొదటి ప్రాధాన్యత) విధానం మరియు ‘విజన్ మహాసాగర్’ కింద మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa