ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 ఏళ్లుగా కోమాలో.. కన్నుమూసిన సౌదీ యువరాజు

international |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 08:01 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడి.. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ అరేబియాకు చెందిన యువరాజు అల్‌వలీద్ బిన్ ఖలెద్ బిన్ తలాల్ శనివారం కన్నుమూశారు. 2005లో లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బిన్ తలాల్ తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు కోమాలోకి వెళ్లిన ఆయన దాదాపు 20 ఏళ్లు మృత్యువుతో పోరాటం సాగించి.. చివరకు ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 36 ఏళ్లు. సౌదీ యువరాజు మరణంపై అంతర్జాతీయ ఇమామ్ కౌన్సిల్ ఓ ప్రకటన చేసింది. ‘‘ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ ఖాలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ మరణవార్త దుఃఖానికి గురిచేసింది..దురదృష్టకర సంఘటనలో గాయపడి 20 ఏళ్లుగా పోరాటం సాగించిన ఆయనకు చివరికి విశ్రాంతి లభించింది’ అని పేర్కొంది.


1990లో జన్మించిన అల్‌ వలీద్.. 2005లో 15 ఏళ్ల వయసులో యూకేలోని మిలిటరీ కాలేజ్‌లో చదువుతోన్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదడుకు తీవ్రగాయం కావడం, రక్తస్రావం వల్ల కోమాలోకి వెళ్లారు. లండన్ నుంచి ఆయనను రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీకి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఆయన రెండు దశాబ్దాలుగా కోమాలోనే ఉన్నారు. అందుకే ఆయనను ‘స్లీపింగ్ యువరాజుగా’గా గుర్తింపు పొందారు.


కుమారుడి మరణంపై సౌదీ రాజు ఖలేద్ బిన్ తలాల్ స్పందిస్తూ.. ‘మరణ సమయం దేవుడే నిర్ణయిస్తాడు’ అని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘దైవ నిర్ణయం.. దీనిని అంగీకరించాల్సిందే.. మా ప్రియ కుమారుడిని కోల్పోయాం.. కానీ ఆయనకు ఆక్సిజన్ తీసేయాలని చాలాసార్లు సూచించినా నేను ఒప్పుకోలేదు. మరణం ఎప్పుడు రావాలో దేవుడే నిర్ణయిస్తాడు’’ అన్నారు.


యువరాజును బతికించడానికి తండ్రి చేయని ప్రయత్నం లేదు. అమెరికా, స్పెయిన్ నుంచి నిపుణులను రప్పించి వైద్యం చేయించినా ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారు. ఇక, యువరాజు మరణంతో సౌదీ రాజ కుటుంబానికి వివిధ దేశాధినేతల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అసర్ నమాజ్ అనంతరం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa