మెదక్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాముని రమేష్ (52) మేడ్చల్లోని ఒక లాడ్జ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హవేళీ ఘనపూర్ మండలం సర్దన జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న రమేష్, గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి భారీగా అప్పులు చేశాడు. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి.. తీర్చలేక పడిన వేదన, ఒత్తిడి చివరకు ఆయన ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటన వడ్డీ వ్యాపారుల అరాచకాలు, వారి మానసిక వేధింపుల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
రమేష్ తన ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. రియల్ ఎస్టేట్ నష్టాల నుంచి బయటపడటానికి తన ఇల్లు, ఇతర ఆస్తులను కూడా అమ్మి అప్పులు తీర్చినట్లు తెలిపాడు. రెండేళ్లుగా అప్పులు తిరిగి చెల్లిస్తున్నప్పటికీ, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నాడు. అయితే, ఇదే సమయంలో కొంతమంది సొంత స్నేహితులే మిత్రద్రోహం చేసి.. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ప్రామిసరీ నోట్లు, చెక్ బౌన్స్ కేసులు పెట్టి తనను, తన కుటుంబాన్ని వేధించారని రమేష్ ఆరోపించాడు. "నా భార్య, పిల్లలు రోడ్డు మీదకు వచ్చాం" అంటూ ఆ వీడియోలో రోదించాడు.
మేడ్చల్లోని లాడ్జ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునే ముందు, తన చావుకు కారణమైన వారి పేర్లను స్పష్టంగా పేర్కొన్నాడు. వారు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వివరించాడు. తనను, తన భార్యను రోడ్డుపాలు చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించి, తన కుటుంబాన్ని కాపాడాలని రమేష్ ముఖ్యమంత్రిని, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను వేడుకున్నాడు. తన కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, చైర్మన్ చంద్ర పాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, అకిరెడ్డి కృష్ణా రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపాడు. తన మరణానంతరం తన కుటుంబంపై ఎలాంటి కేసులు పెట్టకుండా చూడాలని, రోడ్డున పడకుండా ఆదుకోవాలని రమేష్ కన్నీళ్లతో అభ్యర్థించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటువంటి తీవ్ర వేదనతో కూడిన ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేస్తూ, ప్రజలను వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై, ప్రైవేట్ ఫైనాన్సియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనధికారికంగా డబ్బులిచ్చి, అధిక వడ్డీలు వసూలు చేస్తూ, తిరిగి చెల్లించని వారిపై దౌర్జన్యాలు చేస్తున్న ముఠాలపై నిఘా పెంచి, వారిని కట్టడి చేయాలి. బలమైన చట్టాలను అమలు చేయడంతో పాటు, అప్పుల ఊబిలో చిక్కుకున్న వారికి మానసిక మద్దతు, న్యాయ సహాయం అందించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రమేష్ వంటి అమాయకులు మళ్లీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa