ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 08:12 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్‌కు సంబంధించి సిట్ అధికారులు శనివారం రాత్రి నోటీసులిచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పటి వరకు లిక్కర్ స్కాం కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.


లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ అధికారులు రూపొందించిన ఛార్జ్‌షీట్‌ని తాజాగా విజయవాడ ఏసీబీ కోర‌్టు ముందు దాఖలు చేశారు. దీనిలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును సిట్ అధికారులు అనేకసార్లు ప్రస్తావించారు. అయితే ఈ కేసులో ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మొత్తం 305 పేజీల ఛార్జ్‌షీట్‌ని దాఖలు చేశారని సమాచారం.


ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చారు. ఇదిలా తాజాగా మరో 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 16 మందిపై అభియోగాలు మోపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మో‌హన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్‌షీట్‌లో సిట్ ప్రస్తావించారు. ముఖ్యంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, దాని అమలులో తీసుకున్న నిర్ణయాలు అన్నింటి గురించి నాటి ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసు అని ప్రస్తావనకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఆయనను నిందితుడిగా చేర్చలేదు. జగన్ పాత్రపై పూర్తి విచారణ తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని అధికారులు తెలియజేసినట్లు సమాచారం.


అయితే ఛార్జ్‌షీట్‌లో కొత్తగా చేర్చిన 8మంది ఎవరంటే.. సుజల్ బెహ్రూన్, అనిల్ కుమార్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, సైమన్ ప్రసన్, బొల్లారం శివకుమార్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్‌లను నిందితులుగా చేర్చింది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి మరోవైపు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని ఇటు ఏపీ హైకోర్టు, అటు సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించటంతో మిథున్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల సంఖ్య 48కి చేరినట్లు సిట్ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa