ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి.. ఇక కుండపోత వానలు కురుస్తాయి.. అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవచ్చు అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. తీరా చూస్తూ వర్షాకాలం మొదలై రెండు నెలలు పూర్తి కావొస్తున్నా చాలా ప్రాంతాల్లో చినుకు జాడ లేదు. ముందస్తు వానలను నమ్ముకుని చాలా మంది సాగు పనులు ప్రారంభించి విత్తనాలు చల్లారు. కానీ తర్వాత వానలు మొహం చాటేయడంతో.. భూమిలో పెట్టిన విత్తులు మాడిపోయాయి.
ఇక అన్నదాతలు వాన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. ఇదిల ఉంటే వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్కు కీలక అలర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజుల్లో అనగా జులై 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తాయని అంటున్నారు. ఆ వివరాలు..
నెల రోజులుగా కనిపించకుండా పోయినా నైరుతి రుతుపవనాలు మళ్లీ ఊపందుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో అనగా జులై 24 గురువారం నాడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని వల్ల రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఆదివారం, సోమవారం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం గుంటూరు, కృష్ణా, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఏలూరు, బాపట్ల, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో అత్యధికంగా 95.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నంద్యాల, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం మొదలైన జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa