భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సోమవారం ఈయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను అందజేయగా.. మంగళవారం రోజు ఆమె ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఈ ఆకస్మిక పరిణామం గురించి మాట్లాడుతూ.. దన్ఖడ్కు మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన దేశానికి అందించిన సేవలను ప్రశంసించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా ప్రధాని ఈ కామెంట్లు చేశారు.
"ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ జీ రాజీనామా వార్త విన్నాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా దేశానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశాభివృద్ధిలో, ప్రజల సంక్షేమంలో దన్ఖడ్ కీలక పాత్ర పోషించారని ప్రధాని కొనియాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. నిస్వార్థ సేవతో దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన కృషి ప్రశంసనీయమని అన్నారు.
జగదీప్ దన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టక ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పని చేశారని మోదీ గుర్తు చేశారు. ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన తన విధులను సమర్థవంతంగా నిర్వహించి, అనేక కీలక విషయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. అలాగే తన పదవీ కాలంలోఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, దేశానికి నిజమైన మార్గదర్శకుడిగా నిలిచారని ప్రధాని మోడీ తమ సందేశంలో పేర్కొన్నారు.
దన్ఖడ్ రాజీనామాకు ఆరోగ్య కారణాలు చెబుతున్నప్పటికీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే ఈ నిర్ణయం తీసుకోవడం కొంత చర్చకు దారితీసింది. అయితే ఈ పరిణామంపై ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా ప్రధాని మోదీ కేవలం ఆయనకు వ్యక్తిగత శుభాకాంక్షలు మాత్రమే తెలిపారు. అలాగే ఆయన చేసిన సేవలను గుర్తించడంపైనే దృష్టి పెట్టారు. ఈ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవ్వడంతో.. త్వరలోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa