ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 ఏళ్లుగా 150కి పైగా లగ్జరీ కార్లు కొట్టేశాడు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 10:28 PM

దేశవ్యాప్తంగా దాదాపు 150కి పైగా ఖరీదైన లగ్జరీ కార్లను దొంగిలించి, దశాబ్దాలుగా పోలీసులకు సవాల్ విసిరిన ఒక హైటెక్ దొంగను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన సత్యేంద్ర సింగ్ షెకావత్ అనే ఈ దొంగను పుదుచ్చేరిలో పట్టుకున్నారు. ఇతని అరెస్టుతో అనేక రాష్ట్రాల్లో నమోదు అయిన వందలాది కార్ల దొంగతనం కేసులకు తెరపడింది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 45 ఏళ్ల సత్యేంద్ర సింగ్ షెకావత్ ఉన్నత విద్యావంతుడు. ఇతను ఎంబీఏ పట్టభద్రుడు కాగా.. ఇతని తండ్రి ఆర్మీ అధికారిగా పదవీ విరమణ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సత్యేంద్ర.. సుమారు 20 సంవత్సరాలుగా ఈ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే కేవలం లగ్జరీ కార్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్న ఇతడు.. పక్కా పథకం ప్రకారమే కార్లను కొట్టేశేవాడు. ముందుగా సర్వీసింగ్ సెంటర్లు, పార్కింగ్ ప్రదేశాల్లో వదిలి వేసిన ఖరీదైన కార్లను గుర్తించేవాడు. అనంతరం ఆ కారు యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా.. ఆ వాహనాల్లో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్‌లను అమర్చేవాడు.


జీపీఎస్ ద్వారా కారు ఎక్కడ ఉందో పసిగట్టి, అదును చూసి అత్యాధునిక పరికరాలతో వాటి కీ కోడ్‌లను డీకోడ్ చేసి, ఎలాంటి శబ్దం లేకుండానే కార్లను చాకచక్యంగా దొంగిలించేవాడు. దొంగిలించిన కార్లను నేరుగా రాజస్థాన్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి నేపాల్‌తో సహా ఇతర రాష్ట్రాలకు తరలించి అధిక ధరకు విక్రయించేవాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి వంటి పలు రాష్ట్రాల్లో ఇతనిపై వందల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యూహం కారణంగానే ఇన్నేళ్లుగా ఏ రాష్ట్ర పోలీసులు కూడా ఇతన్ని పట్టుకోలేకపోయారు.


ఈ దొంగతనం ముఠా గుట్టు రట్టు కావడానికి చెన్నైలోని అన్నా నగర్‌లో జరిగిన ఒక దొంగతనం కేసు కీలకంగా మారింది. ముఖ్యంగా అన్నా నగర్‌కు చెందిన ఎత్తిరాజ్ రత్నం అనే వ్యక్తికి చెందిన ఖరీదైన కారు గత నెలలో చోరీకి గురైంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఎప్పుడూ సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడే సత్యేంద్ర.. ఈ కేసులో మాత్రం ఓ కెమెరాను గుర్తించలేకపోయాడు. ఫలితంగా సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగ జాడను గుర్తించిన పోలీసులు.. అతడు పుదుచ్చేరిలో నక్కి ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే అక్కడకు చేరుకుని సత్యేంద్ర సింగ్ షెకావత్‌ను అరెస్ట్ చేశారు. ఆపై విచారణ జరుపగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ముఖ్యంగా పోలీసులు ఇతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. 20 ఏళ్లలో 150కి పైగా కార్లను దొంగిలించినట్లు, వాటిని విక్రయించి కోట్లు సంపాదించినట్లు విచారణలో తేలింది. ఇతని హైటెక్ దొంగతనం పద్ధతులు పోలీసులనే ఆశ్చర్య పరిచాయి. సత్యేంద్ర సింగ్ షెకావత్‌ను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇతని అరెస్టుతో దేశవ్యాప్తంగా పలు కార్ల దొంగతనం కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa