భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల తగ్గింపులో తమ పాత్ర కీలకమని అమెరికా మరోసారి పేర్కొనగా, భారతదేశం దీనిని గట్టిగా ఖండించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం అనేది కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమేనని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో జరిగిన బహిరంగ చర్చలో ఈ దౌత్యపరమైన వివాదం చోటుచేసుకుంది.ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి, రాయబారి డోరతీ షియా.. పాకిస్థాన్ అధ్యక్షతన జరిగిన 'మల్టీలాటరలిజం- శాంతియుత వివాద పరిష్కారం' అనే చర్చలో మాట్లాడుతూ గత మూడు నెలల్లో ఇజ్రాయెల్-ఇరాన్, కాంగో-రువాండా, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ తమ పరిపాలన భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడిందని, ఒకవేళ ఈ ఉద్రిక్తతలు తీవ్రమైతే రెండు దేశాలతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని హెచ్చరించినట్టు పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ అమెరికా వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు. ఈ ఆపరేషన్లో భారత్, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సంయమనపూర్వక చర్యలు చేపట్టినట్టు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa