ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార నివాసం ఖాళీ చేయబోతున్న దన్ఖడ్

national |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 07:02 PM

భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్‌.. ఢిల్లీలోని నూతనంగా నిర్మించిన ఉపరాష్ట్రపతి నివాసం (వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్) నుంచి మారేందుకు సిద్ధం అవుతున్నారు. పదిహేను నెలల స్వల్ప వ్యవధిలోనే ఆయన ఈ అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. ఆరోగ్య కారణాలను చూపుతూ దన్ఖడ్‌ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఈ నివాస మార్పిడి ప్రక్రియ మొదలైంది.


గత ఏడాది ఏప్రిల్‌లో చర్చ్ రోడ్‌లోని ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌లోకి దన్ఖడ్‌ మారారు. ఇది అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం. అయితే ఇదే బంగ్లా ఆయనకు అధికారిక నివాసంగా, కార్యాలయంగా కూడా పని చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత దన్ఖడ్‌కు ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యూటెన్స్ ప్రాంతంలో ఒక టైప్ VIII ప్రభుత్వ బంగ్లాను కేటాయించనున్నారు. సాధారణంగా ఈ రకం నివాసాలను కేంద్ర మంత్రులు లేదా జాతీయ పార్టీల అధిపతులకు కేటాయిస్తారు. దన్ఖడ్‌కు బంగ్లాతో పాటు పదవీ విరమణానంతరం కూడా ఆయనకు తగిన గౌరవం, సౌకర్యాలు లభిస్తాయని తెలుస్తోంది.


ఉపరాష్ట్రపతిగా పని చేసిన వారికి పదవీ విరమణ అనంతరం పెన్షన్‌తో పాటు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు. నిబంధనల ప్రకారం ఉప రాష్ట్రపతిగా 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన వారికి పెన్షన్ పొందడానికి అర్హత ఉంటుంది. 2018లో బడ్జెట్‌లో నిర్ణయించిన ప్రకారం.. భారత ఉప రాష్ట్రపతి వేతనం సంవత్సరానికి రూ.48 లక్షలు. దీని ఆధారంగానే వారికి పెన్షన్ లభిస్తుంది. సాధారణంగా ఉప రాష్ట్రపతి వేతనంలో 50 నుంచి 60 శాతాన్ని పెన్షన్‌గా ఇస్తారు. ఈ లెక్కన దన్ఖడ్‌కు రూ.2 లక్షల కంటే ఎక్కువ పెన్షన్ వస్తుంది. అలాగే మాజీ ఉపరాష్ట్రపతికి ఉండడానికి టైప్-8 ప్రభుత్వ బంగ్లాను కేటాయిస్తారు. అంతేకాకుండా ఉచిత, విమాన రైలు ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి.


ఉచితంగా వైద్య సౌకర్యం కూడా పొందవచ్చు. మరీ ముఖ్యంగా వ్యక్తిగత ప్రైవేటు వైద్యుడిని అందుబాటులో ఉంచుతారు. ఇద్దరు వ్యక్తిగత సహాయకులను కూడా కేటాయిస్తారు. ఉపరాష్ట్రపతి జీవిత భాగస్వామికి ఒక ప్రైవేటు కార్యదర్శిని ఇస్తారు. ఇంటి విద్యుత్తు, నీటి బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఫర్నీచరు, కొన్ని ఉపకరణాలు సహా రెండు మొబైల్ ఫోన్లు కూడా ఇస్తారు.


పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయంపై స్పందిస్తూ.. దన్ఖడ్‌కు త్వరలో తగిన నివాసం కేటాయించబడుతుందని ధృవీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దన్ఖడ్‌ సోమవారం తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆరోగ్య సమస్యల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. మంగళవారం రోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. అదే రోజు ప్రధాని మోదీ సైతం దీనిపై స్పందించి.. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa