ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడిగింపు, ఎప్పటి వరకంటే

national |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 07:03 PM

భారతదేశం తన గగనతలంలోకి పాకిస్థాన్‌ విమానాల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 24వ తేదీ వరకు పొడిగించింది. బుధవారం రోజు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి పాక్‌కు చెందిన అన్ని రకాల విమానాలపై ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఈ పొడగింపు చేశారు. దీనికి ప్రతిస్పందనగా.. పాకిస్థాన్‌ కూడా భారతీయ విమానాలను తమ గగనతలంలోకి అనుమతించకుండా విధించిన నిషేధాన్ని ఆగస్టు 24వ తేదీ వరకు పొడిగించింది.


ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ గగనతలంలోకి పాక్ ప్రవేశించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. మొదట మే 24వ తేదీ వరకు గగన తలాన్ని మూసివేయగా.. దాన్ని మళ్లీ జూన్ 24వ తేదీ వరకు పొడగించింది. ఆ తేదీ దగ్గరకు రావడంతో.. మళ్లీ జులై 24వ తేదీ వరకు పొడగించింది. ఇప్పుడు ఈ తేదీ కూడా దగ్గరకు వచ్చిన నేపథ్యంలోనే మరోసారి ఆగస్టు 24వ తేదీ వరకు పొడగించింది. ఇదే తరహాలో పాకిస్థాన్ సైతం తన గగన తలంలోకి భారత్ విమానాలకు నిషేధం విధించింది.


ఈ పరిణామాల మధ్యనే భారత వైమానిక దళం (IAF) రాజస్థాన్‌లో భారత్-పాకిస్థాన్‌ సరిహద్దు వెంబడి భారీ స్థాయి విన్యాసాలను ప్రారంభించింది. జూలై 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్న ఈ వ్యాయామాలు బార్మర్ నుంచి జోధ్‌పూర్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలను కవర్ చేస్తాయి. ఇలాంటి సైనిక కార్యకలాపాల సమయంలో పౌర విమానాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు 'నోటీస్ టు ఎయిర్‌మెన్' జారీ చేశారు. ఇది సాధారణంగా విమానాలను అనుమతించని ప్రత్యేక గగనతల ప్రాంతాలను సూచిస్తుంది. పౌర ప్రాణ నష్టాన్ని నివారించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.


ఈ ప్రాంతంలో వైమానిక విన్యాసాలు నిర్వహించడం, గగనతల నిషేధాన్ని పొడిగించడం వంటి చర్యలు సరిహద్దులో భద్రతను బలోపేతం చేయడంలో భారత్ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7వ తేదీన 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించింది. ఆ సమయంలో కూడా ఇలాంటి నోటమ్‌నే జారీ చేసింది. అది పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇలా ఇరు దేశాల మధ్య ఉన్న వివాదం వలన అంతర్జాతీయ విమానయాన మార్గాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఫలితంగా ప్రయాణ సమయాలు పెరిగి, ఖర్చులు అధికమవుతున్నాయి. ఇరు దేశాలు శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ.. సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa