క్యాన్సర్ కారణంగా తల్లినీ, తోబుట్టువునూ కోల్పోయిన తనకు.. ఆ వ్యాధి ఎంత ప్రమాదకరమో అవగాహన ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. స్వానుభవంతో ఈ వ్యాధిని అరికట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఏటా 75వేల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగులోకి వస్తుండగా, ఇందులో దాదాపు 30 వేల మంది మరణిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్సీడీ 4.0 సర్వేను పటిష్ఠంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మంగళగిరిలో వర్క్షాపు నిర్వహిస్తున్నారు. గురువారం ఈ వర్క్షాపునకు హాజరైన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికే 70 శాతం స్ర్కీనింగ్ లక్ష్యాన్ని చేరుకున్న ఎన్సీడీ 3.0ని ఈ ఏడాది ఆగస్టు వరకూ కొనసాగిస్తామని తెలిపారు. ఇందులో 4.10 కోట్ల మందిని స్ర్కీనింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి వరకూ దాదాపు 3 కోట్ల మందిని పరీక్షించినట్లు తెలిపారు. సెప్టెంబరు నుంచి ఎన్సీడీ 4.0ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. క్యాన్సర్ వ్యాప్తిపై సర్వే చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఏపీకి ఘనత దక్కిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 10 ప్రధాన వ్యాధులు అనారోగ్య భారానికి కారణం కాగా, అందులో 6 అసంక్రమిత వ్యాధులేనని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa