భారతదేశాన్ని ఇబ్బందులు పెడుతున్న సమస్యలలో.. రోడ్డు ప్రమాదాలను కూడా ప్రధానంగా చెప్పుకొవచ్చు. మనదేశంలో నిత్యంలో ఏదో ఒక మూల ప్రమాదం జరుగుతూనే ఉంది.. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంకృతాపారాధాల వలన ప్రాణాలు పోగొట్టుకుంటే.. మరికొన్నిసార్లు మన ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా ఇతరుల తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కఠినమైన చట్టాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డ్రైవింగ్ లైసెన్స్ ల జారీని కూడా మరింత కట్టుదిట్టం చేశారు. విశాఖపట్నంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి.. డ్రైవింగ్ లైసెన్సు పరీక్ష చేపడుతున్నారు. ఈ ప్రక్రియ కారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటూ వస్తున్న వారిలో సగానికి పైగా డ్రైవింగ్ టెస్టులో ఫెయిల్ అవుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి.
విశాఖపట్నంలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ కావటం ఇప్పుడంత ఈజీ కాదు. విశాఖపట్నంలోని గంభీరమ్ వద్ద ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ విధానంలో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఆరు నెలల కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన 50 శాతం నుంచి 60 శాతం మంది అభ్యర్థులు ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ విధానంలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ కాలేకపోయారని లెక్కలు చెప్తున్నాయి. ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ విధానంలో భాగంగా సెన్సార్ల ద్వారా ఎలక్ర్టానిక్ పద్ధతిలో పర్యవేక్షణ ఉంటుంది. ఈ కారణంగా ఎక్కువ మంది డ్రైవింగ్ టెస్ట్ పాస్ కాలేకపోతున్నట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా S, T, 8 టెస్టు ట్రాకులలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.
విశాఖపట్నంలోని గంభీరమ్ వద్ద ఉన్న ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్ వద్దకు డ్రైవింగ్ టెస్టుల కోసం రోజూ 80 నుంచి 120 మంది వరకూ వస్తుంటారు. అయితే వారిలో 40 నుంచి 60 మంది వరకూ డ్రైవింగ్ టెస్టులో ఫెయిల్ అవుతున్నారు. ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్ వ్యవస్థలో టెస్టింగ్ ట్రాక్ అంతటా సెన్సార్లు అమర్చి ఉంటాయి. వాహనం ప్రతి కదలికను ఈ సెన్సార్లు పసిగడుతూ ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నట్లు తెలిసింది. డ్రైవింగ్ టెస్ట్ విషయానికి వస్తే రెండు పద్ధతులో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉంటుంది. ఒకటి రాతపరీక్ష. రెండోది గ్రౌండ్ టెస్టు. అయితే గ్రౌండ్ టెస్టులో భాగంగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు H, S, T, 8 ట్రాకుల గుండా వాహనాన్ని నడపాల్సి ఉంటుంది.
అయితే ట్రాకుల కుండా వాహనాలను నడిపే సమయంలో ఏ మాత్రం తడబడినా సెన్సార్లు పసిగట్టేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ కాలేకపోతున్నారు. అయితే మొదటిసారి వాహనాన్ని నడపటంలో తడబడి ఫెయిల్ అయినవారు.. రెండు, మూడో ప్రయత్నాల్లో పాస్ అయ్యి లైసెన్స్ పొందుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక ఫెయిల్ అవుతామనే భయంతో ఇప్పుడు ఎక్కువ మంది తొలుత డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత లైసెన్స్ టెస్టుకు వస్తున్నట్లు తెలిపారు. గతంలో చిన్న చిన్న తప్పులు చేసినా లైసెన్సులు వచ్చేవని.. కానీ ఇప్పుడు అధునాతన ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్ కారణంగా చిన్న తప్పు చేసినా డ్రైవింగ్ టెస్టులో ఫెయిల్ అవుతున్నారని చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa