బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ' బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం ' కింద అర్హులైన జర్నలిస్టులు, వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే నెలవారీ పెన్షన్ ప్రయోజనాలను గణనీయంగా పెంచారు. ఇప్పటి వరకు పాత్రికేయులకు కేవలం రూ.6 వేలు మాత్రమే అందుతుండగా.. దాన్ని ఎకాఎకిన రూ.15 వేలకు పెంచేశారు.
3 వేల రూపాయల నుంచి 10 వేలకు పెంపు..
నితీశ్ కుమార్ ప్రకటన ప్రకారం.. జర్నలిస్టులకు ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ. 6,000 నుంచి రూ. 15,000కు పెరిగింది. ఇది కేవలం జర్నలిస్టులకు మాత్రమే కాకుండా మరణించిన జర్నలిస్టులపై ఆధార పడిన జీవిత భాగస్వాములకు కూడా వర్తిస్తుంది. వారికి ఇచ్చే జీవిత కాల పెన్షన్ రూ. 3,000 నుంచి రూ. 10,000కు పెంచింది. ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రియే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులది అత్యంత ముఖ్యమైన పాత్ర అని నొక్కి చెప్పారు. సమాజానికి నిజమైన వార్తలను అందించడంలో, ప్రజల వాణిని ప్రభుత్వానికి వినిపించడంలో జర్నలిస్టులు కీలకమైన నాలుగవ స్తంభంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
సామాజిక అభివృద్ధిలో వారి కృషి అపారమని, అందుకే ప్రభుత్వం మొదటి నుండి వారి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. పాత్రికేయులు ఏమాత్రం పక్షపాతం లేకుండా తమ వృత్తిని కొనసాగించడానికి, పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ లక్ష్యంతోనే పింఛన్ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం పెన్షన్ పెంపు మాత్రమే కాదని, పాత్రికేయ వృత్తికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, వారి త్యాగాలకు గుర్తింపు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కీలక ప్రకటన 2025 చివరిలో జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రావడం గమనార్హం. ఎన్నికల ముందు ఇలాంటి సంక్షేమ పథకాల పెంపుదల సహజంగానే రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే ప్రభుత్వ వాదన ప్రకారం.. ఇది జర్నలిస్టుల దీర్ఘకాల డిమాండ్లకు మరియు వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగా తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పెంపుతో వేలాది మంది జర్నలిస్టులు, వారి కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఇది బీహార్లోని జర్నలిస్ట్ సంఘాలకు ఆర్థికంగా పెద్ద ఊరటను ఇస్తోంది. మొత్తంగా నితీశ్ కుమార్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa