రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లా పిల్పోడి గ్రామంలో శుక్రవారం జరిగిన హృదయ విదారక ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా బడి భవనం కుప్పకూలగా.. ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 27 మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనలో గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డ ఓ విద్యార్థిని ప్రమాద క్షణాలను గుర్తు చేసుకుంటూ సంచలన విషయాలను బయట పెట్టింది. పాఠశాల భవనం పైనుంచి కంకర రాళ్లు పడడం గుర్తంచానని.. అదే విషయాన్ని ఉపాధ్యాయురాలుకి కూడా చెప్పినట్లు పేర్కొంది. కానీ అప్పుడు ఆమె పోహా తింటూ తాను చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదని.. ఆ తర్వాత కాసేపటికే పైకప్పు కూలిందని చెప్పుకొచ్చింది. ఆయన అప్పుడే స్పందించి ఉంటే పిల్లలంతా ప్రాణాలతో బయట పడేవారని వెల్లడించింది.
సంఘటన జరిగిన తీరును ఒక విద్యార్థిని కన్నీటిపర్యంతమై వివరించింది. ముఖ్యంగా శుక్రవారం రోజు ఉదయం అసెంబ్లీకి కొన్ని నిమిషాల ముందే తమను ఉపాధ్యాయురాలు ఓ గదిలే వేచి ఉండమని చెప్పినట్లు పేర్కొంది. అప్పుడై పైకప్పు నుంచి చిన్న చిన్న కంకర రాళ్లు పడడం ప్రారంభం అయిందని వివరించింది. ఆ విషయం గుర్తించిన వెంటనే తాను ఉపాధ్యాయురాలికి ఆ విషయం చెప్పానని.. కానీ ఏమీ పడట్లేదు మీరు కూర్చోమని చెప్పిందని వెల్లడించింది. అయితే ఆ సమయంలో టీచర్ పోహా తింటోందని.. పేర్కొంది. ఆమె తాను చెప్పిన మాటలు పట్టించుకుని ఉంటే ప్రమాదం నుంచి అంతా బయట పడేవాళ్లని చెప్పింది. అదృష్టవశాత్తు తాను బయటపడినా తన స్నేహితులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పి కన్నీటి పర్యంతం అయింది.
మరో విద్యార్థి మాట్లాడుతూ.. పాఠశాల భవనం శిథిలావస్తకు చేరుకున్నట్లు పదే పదే తాము ఫిర్యాదులు చేసిన ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు. వారు అప్పుడే పట్టించుకుని ఉంటే.. అసలీ ప్రమాదమే సంభవించి ఉండేది కాదని స్పష్టం చేశాడు. మరోవైపు ఈ దుర్ఘటనపై తక్షణమే స్పందించిన అధికారులు.. ఐదుగురు పాఠశాల సిబ్బందిని సస్పెండ్ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో ఏ పాఠశాల భవనం కూడా శిథిలావస్థలో ఉండకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశాధినేతలు కూడా ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అయితే ఝాలావర్ జిల్లా కలెక్టర్ అజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరిన్ని ప్రశ్నలకు తావిస్తున్నాయి. కూలిపోయిన పాఠశాల భవనం శిథిలావస్థలో ఉన్న పాఠశాలల జాబితాలో లేదని ఆయన పేర్కొన్నారు. ఇది అధికారుల పర్యవేక్షణ లోపాన్ని, లేదా సమాచార లోపాలను సూచిస్తోంది. ముఖ్యంగా ఓ విద్యార్థిని హెచ్చరికలు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, మరోవైపు అధికారిక జాబితాలో లేని భవనం కూలడం.. ఈ అంశాలన్నీ సంఘటన తీవ్రతను, దీని వెనుక ఉన్న నిర్లక్ష్యపు పొరలను వెలుగులోకి తెస్తున్నాయి. ఈ దుర్ఘటన ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలపై, వాటి భద్రతపై తక్షణ దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa