ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సడెన్ షాకిచ్చిన టీసీఎస్.. 12వేలకు పైగా ఉద్యోగుల తొలగింపు

business |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 11:24 PM

 దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు సడెన్ షాకిచ్చింది. భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే 2026 ఏప్రిల్ తర్వాత నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగల సంఖ్యలో ఏకంగా 2 శాతం ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. అంటే దాదాపు 12 వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉన్నట్లుండి ఉద్యోగాల కోత ప్రకటించడంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. మనీ కంట్రోల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ తెలిపారు.


టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలకు దీటుగా సంస్థను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగానే లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సీఈఓ కృతివాసన్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీసీఎస్ విభాగాల్లో అమలు అవుతుందని చెప్పారు.


'కొత్త టెక్నాలజీలను ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నాం. పని చేసే విధానాలూ మారుతున్నాయి. అందుకే భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఏఐని ఉపయోగిస్తూ కావాల్సిన నైపుణ్యాలను ఎవాల్యుయెట్ చేస్తున్నాం. మా ఉద్యోగులకు కెరీర్ వృద్ధి, విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు చాలా పెట్టుబడి పెట్టాం. కానీ, కొన్ని రోల్స్‌లో వృద్ధి కనిపించడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మా ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ముఖ్యంగా మధ్యస్థ, సీనియర్ స్థాయుల్లో ఉన్న ఉద్యోగులపై ప్రభావం ఉంటుంది. అయితే, ఇది అంత సులభమేమీ కాదు. సీఈఓగా నేను తీసుకునే కఠిన నిర్ణయాల్లో ఇదీ ఒకటి' అని కృతివాస్ అన్నారు.


ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినా సాధ్యమైన మేరకు ఉపాధి కోల్పోయే ఉద్యోగులకు మేలు చేసేందుకే కృషి చేస్తామని సీఈఓ కృతివాస్ తెలిపారు. జూన్ 2025తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్‌‍లో ఉద్యోగుల సంఖ్య 6,13,000 గా ఉంది. అంటే 2 శాతం ఉద్యోగులను తొలగిస్తారంటే దాదాపు 12,200 మందిపై ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. అయితే, లేఆఫ్స్‌ను నేరుగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది ప్రణాళికల్లో భాగంగా ఈ ప్రభావం ఉండవచ్చని సీఈఓ తెలిపారు. అయితే, అప్పటి వరకు ఏవైనా మార్పులు జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించడం అదే దారిలో టీసీఎస్ నడుస్తుండడం ఐటీ ఉద్యోగులను కలవర పెడుతుందని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa