జమ్మూ కశ్మీర్లో జరిగిన పహల్గామ్ దాడికి భారత సైన్యం దీటైన ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయిన పాకిస్థాన్ ఆర్మీ మాజీ కమాండో సులేమాన్ షా అలియాస్ హషీమ్ ముసాను శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో సైన్యం మట్టుబెట్టింది. ఈ మిషన్కు ‘ఆపరేషన్ మహాదేవ్’ అనే పేరును సూచించారు. కశ్మీర్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ ఆర్మీలోని అత్యంత ప్రతిష్టాత్మక స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)లో శిక్షణ తీసుకున్న మూసా.. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబా (LeT) ఉగ్రవాద సంస్థలో చేరి.. భారత్లో ఉగ్రచర్యలకు పాల్పడ్డాడు.
ఆపరేషన్ మహాదేవ్ ఎలా సాగింది?
శ్రీనగర్ సమీపంలోని డచ్చిగామ్ అడవుల్లో ఉన్న మహదేవ్ పర్వతం పేరునే ఈ ఆపరేషన్కు సూచించారు. ముష్కరులు మహాదేవ్ పర్వతం సమీపం అడివిలోని గుట్టల మధ్య నక్కినట్టు సమాచారం. అక్కడ వారు అడవుల్లో పోరాటానికి శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు భౌతిక నిఘాతో పాటు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ కూడా కొనసాగించాయి. జూలై ప్రారంభంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ రేడియో కమ్యూనికేషన్ చురుకుగా ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి.
లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ 2016 నుంచి WY SMS అనే చైనా రేడియో వ్యవస్థను కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తోంది. అందుకే, డచ్చిగాం అడవులపై ఎన్కౌంటర్కు ముందు నుంచి ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తం 14 రోజుల పాటు లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల కదకలికలను భద్రతా బలగాలు ట్రాక్ చేశాయి. చివరకు హర్వాన్ ప్రాంతంలోని ముల్నార్ అడవుల్లో ఈ ఆపరేషన్ను మొదలుపెట్టారు. ఇందులో ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్, జమ్మూ-కశ్మీర్ పోలీసుల సంయుక్తంగా పాల్గొన్నాయి. .
ఎన్కౌంటర్ మొదలైన తర్వాత అదనపు బలగాలను అక్కడికి తరలించి.. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు స్థావరాలను ఏర్పాటుచేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఘటనా స్థలిలో కార్బైన్ తుపాకులు, AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, ఇతర భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో భారీ ఉగ్రదాడులకు ముష్కరులు సిద్ధమైనట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్లో చర్చకు కొద్ది గంటల ముందే కశ్మీర్లో పహల్గామ్ దాడి ప్రధాన సూత్రధారితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టడం విశేషం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించారు. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో విపక్షాల ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. భారత దెబ్బకు పాక్ తోకముడిచి, కాళ్లబేరానికి వచ్చిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa