భర్త హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కున్న ఓ రసాయన శాస్త్ర ప్రొఫెసర్.. తన కేసును తానే వాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మధ్య ప్రదేశ్ హైకోర్టుకు జడ్జికే పాఠాలు చెప్పిన ఈ మహిళా ప్రొఫెసర్యే ఆమె భర్తను చంపినట్లు తేలగా.. తాజాగా న్యాయస్థానం ఆమెకు జీవితఖైదు శిక్ష విధించింది. మొత్తంగా 97 పేజీల తీర్పును న్యాయస్థానం వెలువరించగా.. అంతా ఆశ్చర్య పోతున్నారు. మరి ఈ హత్య ఎలా వెలుగులోకి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. మమత పాఠక్ ఛత్తాపూర్లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్గా పని చేశారు. ఆమె భర్త డాక్టర్ నీరజ్ పాఠక్ 2021లో అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే మరణించారు. అయితే భార్యాభర్తలు ఇద్దరికీ చాలా కాలంగా గొడవలు జరుగుతుండగా.. మమతా పాఠకే అతడిని చంపినట్లు పోలీసులు భావించారు. కాకపోతే ఎలాంటి ఆధారమూ లేకపోవడంతో.. నీరజ్ మరణం విద్యుదాఘాతం వల్ల సంభవించిందని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికల్లో అనుమానాలు వ్యక్తం కాగా.. మమతా పాఠక్పై కేసు పెట్టారు. కోర్టులో కూడా హాజరు పరచగా.. దిగువ కోర్టు 2022లో ఆమెను దోషిగా తేల్చింది.
అయితే ఆమె పిల్లలు మానసిక వైకల్యంతో బాధ పడుతుండగా.. విషయం గుర్తించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆమె మధ్య ప్రదేశ్ హైకోర్టులోని జబల్పూర్ బెంచ్కు అప్పీల్ చేసుకున్నారు. అలాగే తనకు ఏ న్యాయవాది అవసరమూ లేదని.. తానే తన కేసును వాదించుకుంటానని పేర్కొన్నారు. అందుకు హైకోర్టు కూడా ఓకే చెప్పగా.. ఆమె తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా తనకు రసాయ శాస్త్రంలో ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. వాడి వేడి వల్ల అయ్యే గాయాలు, విద్యుదాఘాతంతో అయ్యే గాయాలను వివరించారు. వాటిని చూసి పోస్టుమార్టం చేసిన వైద్యుడు పొరబడి ఉంటారని కూడా పేర్కొన్నారు.
ఇదంతా విన్న న్యాయమూర్తి.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మీరు కెమెస్ట్రీ ప్రొఫెసరా అని ప్రశ్నించారు. అందుకు ఆమె అవునని చెప్పగా.. ఈ వీడియో వైరల్ అయింది. జడ్జికే పాఠాలు చెప్పిన మహిళ అంటూ అప్పట్లో తెగ ట్రెండ్ అయంది. ఈక్రమంలోనే ఆమెకు మద్దతు కూడా లభించింది. అయితే ఈ కేసును తీవ్రంగా తీసుకున్న న్యాయస్థానం కీలక అంశాలను పరిశీలించేందుకు అమికస్ క్యూరిగా సురేంద్ర సింగ్ను నియమించింది.
ఆ తర్వాత ఆయన పూర్తిగా విచారణ జరిపి.. మమతా పాఠక్నే నిందితురాలిగా తేల్చారు. తాజాగా ఈ కేసు విచారణ జరగ్గా.. అదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే కోర్టు కూడా ఆమెను దోషిగా తేల్చి జీవితఖైదు శిక్ష విధించింది. ఈమేరకు కోర్టు 97 పేజీల తీర్పును వెలువరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa