లోక్సభలో మంగళవారం రోజు "ఆపరేషన్ సింధూర్"పై జరిగిన చర్చ సందర్భంగా రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బెనివాల్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అధినేత అయిన బెనివాల్.. పాకిస్థాన్ను భారతదేశపు భార్యగా అభివర్ణించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్కు సిందూరం పెట్టిందని గుర్తు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం సిందూరం పెడితే పెళ్లి జరిగినట్లేనని.. ఇలా ఇండియా దాయాది దేశానికి సిందూరం పెట్టి భార్యగా చేసుకుందని వెల్లడించారు. పెళ్లైపోయిన తర్వాత వధువును అత్తారింటికి తీసుకు రావడం మాత్రమే మిగిలిందని.. త్వరగా పాక్ను భారత దేశానికి తీసుకు రండంటూ చమత్కరించారు.
సాధారణంగా తీవ్రమైన చర్చలకు వేదికయ్యే పార్లమెంట్లో బెనివాల్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఇరు పక్షాల నాయకులను సైతం నవ్వించాయి. ఆయన పక్కనే కూర్చున్న నగీనా ఎంపీ, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా బెనివాల్ ప్రసంగాన్ని ఆస్వాదించారు. బెనివాల్ ప్రసంగ సమయం ముగిసినా.. ఆజాద్ ఆయనకు అదనపు సమయం ఇవ్వాలని కోరడం విశేషం. ఈ సరదా వ్యాఖ్యలతో పాటు బెనివాల్ కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. పహల్గామ్ దాడికి దారి తీసిన భద్రతా వైఫల్యంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అలాగే అగ్నివీర్ నియామక పథకాన్ని కూడా తీవ్రంగా విమర్శించి, దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సైన్యంలో తక్కువ కాలపు సేవకు యువతను నియమించే ఈ పథకం దేశ భద్రతకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన వాదించారు. పహల్గామ్ ఘటనలో తీవ్రవాదుల దాడిని ప్రస్తావిస్తూ.. భద్రతా సంస్థల వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ అంతర్గత, బాహ్య భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. హనుమాన్ బెనివాల్ ప్రసంగం పార్లమెంటులో నవ్వులు పూయించినప్పటికీ.. బెనివాల్ తన నియోజకవర్గం ప్రజల సమస్యలను, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను కూడా అందరి దృష్టికి తీసుకెళ్లి శభాష్ అనిపించుకున్నారు.
బెనివాల్ రాజకీయ చాతుర్యం, హాస్యాన్ని కలగలిపి కీలక సందేశాలను బలంగా వినిపించడంలో ఎంత నిపుణుడో.. ఈ ప్రసంగం ద్వారా మరోసారి రుజువైంది. దేశ సరిహద్దుల భద్రత, సైనిక నియామకాల వంటి సున్నితమైన అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. బెనివాల్ ప్రసంగం పార్లమెంటు రికార్డులలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. వెంటనే పాక్ను ఇండియాలో కలిపేసుకోవాలంటూ వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa