ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దమానీకి ఒక్కరోజే రూ. 4 వేల కోట్ల లాభం..భారీగా దూసుకెళ్లిన డీమార్ట్ షేరు

business |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 10:28 PM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లో కూడా లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 144 పాయింట్లు పెరగడంతో 81,482 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 34 పాయింట్ల లాభంతో 24,855 వద్ద సెషన్ ముగించింది. అయితే ఇక్కడే మనం ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించిన ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం. అదే డీమార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్. ఇవాళ (బుధవారం) ఇది భారీగా దూసుకెళ్లింది. కిందటి సెషన్‌లో ఈ షేర్ ధర రూ. 3999 వద్ద ముగియగా.. ఇవాళ అక్కడే ఓపెన్ అయింది. అక్కడి నుంచి లాభాల్లో దూసుకెళ్లింది.


ఇంట్రాడేలో ఒక దశలో 8 శాతానికిపైగా పెరిగి రూ. 4,324 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 7.06 శాతం పెరిగి రూ. 4,281.40 వద్ద స్థిరపడింది. ఒక్క షేరు ధర రూ. 282.40 పెరగడం విశేషం. ఇక పోర్ట్‌ఫోలియోలో 100 డీమార్ట్ షేర్లు ఉన్న వారికి.. ఒక్కరోజులోనే రూ. 28 వేలకుపైగా లాభం వచ్చిందని చెప్పొచ్చు.


ఇవాళ్టి స్టాక్ ధర 4 వారాల గరిష్ట స్థాయి మాత్రమే కాకుండా.. మార్చి తర్వాత ఒక రోజులో ఇంత మేర పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్టాక్ 52 వారాల గరిష్ట ధరకు ఇంకా చాలా దూరంలోనే ఉంది. డీమార్ట్ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 5,484.85 కాగా.. కనిష్ట ధర రూ. 3,340 గా ఉంది. ఇక కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంది.


డీమార్ట్ కంపెనీ కొత్త స్టోర్లను పెంచనున్నట్లు కంపెనీ విశ్లేషకులకు తెలియజేయడంతో స్టాక్ భారీగా పెరిగింది. క్విక్ కామర్స్ వల్ల తమ ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనను కాస్త తగ్గించింది. అయితే.. ఇంట్రాడేలో స్టాక్ 8 శాతం మేర పెరగడంతో ఒక్కరోజులోనే అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ సంపద రూ. 4,819 కోట్లు పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. సెషన్ చివరకు ఇది కాస్త తగ్గి రూ. 4.23 వేల కోట్ల లాభంతో ముగిసింది. దమానీ.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరి నాటికి 14,98,48,238 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీలో 23.03 శాతం వాటా. దమానీ భార్య.. శ్రీకాంతదేవి రాధాకిషన్ దమానీ పేరిట ఉన్న షేర్ల విలువ కూడా రూ. 180 కోట్లకుపైగా పెరిగింది. ఆమె జూన్ చివరి నాటికి 65,00,000 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీలో ఒక శాతం వాటా.


డీమార్ట్ ఇటీవల పఠాన్‌కోట్‌లో కొత్త స్టోర్‌ ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 426కు చేరింది. అంతకుముందు ఆగ్రా, ఉత్తర్‌ప్రదేశ్‌లో (యూపీ) ఒక స్టోర్‌ను ప్రారంభించింది. యూపీ, ఒడిశా వంటి పెద్ద రాష్ట్రాల్లో మరిన్ని స్టోర్లను తెరిచే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 50 కొత్త స్టోర్లను ప్రారంభించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా ఈ సంఖ్య 41, 40 గా ఉంది.


క్విక్ కామర్స్ నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు డీమార్ట్.. ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే ధాన్యాలు, పప్పులు, పిండి వంటి బల్క్ గ్రోసరీ విభాగాల్లో ప్రైవేట్ లేబుల్స్‌ను అందించింది. ఇప్పుడు బిస్కెట్లు, క్యాండీలు, గృహ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వంటి బ్రాండెడ్ కేటగిరీల్లోకి విస్తరిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa