ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓతో వస్తోన్న 'అంబానీ'

business |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 10:32 PM

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మరో ఐపీఓ రానుంది. అంబానీ మరోసారి పబ్లిక్ ఇష్యూ ద్వారా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. మార్కెట్ చరిత్రలోనే అది పెద్ద పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. రిలయన్స్ టెలికాం విభాగమైన జియో ఇన్ఫోకామ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా 6 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 52,200 కోట్లు సమీకరించనున్నట్లు సమాచారం.


ఇదే జరిగితే ఇప్పటి వరకు అతి పెద్ద ఐపీఓగా నిలిచిన రూ. 28,000 కోట్ల హ్యుందాయ్ పబ్లిక్ ఇష్యూ రికార్డును బద్ధలుకొట్టనుంది. దాని కంటే దాదాపు రెండు రెట్లు అధికమైన విలువతో జియో ఇన్ఫోకామ్ ఐపీఓకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంప్రదింపులు మొదలు పెట్టినట్లు సమాచారం.


సెబీ నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీలో 25 శాతం ప్రజల వాటా ఉండాలి. అంతకు సమానమైన షేర్లను విక్రయించాలి. కానీ జియో ఇన్ఫోకామ్ మాత్రం 5 శాతం షేర్లనే పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించాలనుకుంటుందటా. 25 శాతం వాటా విక్రయిస్తే భారీ మొత్తం అవుతుందని, దీంతో మార్కెట్ హ్యాండిల్ చేయడం కష్టతరమవుతుందని, అందుకు సిద్ధంగా లేనట్లు సెబీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో అందుకు అనుగుణంగా ఐపీఓ లిస్టింగ్ రూల్స్ సైతం సెబీ మార్చనున్నట్లు తెలుస్తోంది.


 జియో ఇన్పోకామ్ పబ్లిక్ ఇషయూ వచ్చే ఏడాది 2026లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఐపీఓ విలువ, సమయానికి సంబంధించి మార్కెట్ పరిస్థితుల ప్రకారం మారవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒక వేళ అనుకున్నట్లు జరిగితే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించనుంది.


జియో ఇన్పోకామ్ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా గూగుల్, మెటా వంటి పెద్ద ఇన్వెస్టర్లకు కొంత వాటా విక్రయించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆయా కంపెనీలు 2020లోనే జియోలో 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. అప్పుడు జియో విలువ 58 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. కానీ ఇప్పుడు అది 100 బిలియన్ డాలర్లు దాటేసినట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జియో పబ్లిక్ ఇష్యూను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రిలయన్స్ సుముఖంగా లేదని రాయిటర్స్ గతంలోనే పేర్కొంది. టెలికాం వ్యాపారం, డిజిటల్ సర్వీసెస్ వ్యాపారాన్ని మరింత విస్తరించి, ఐపీఓకు ముందే కంపెనీ విలువ పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది. 2025, ఆగస్టు నెలలో జరిగే రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం లో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నాయి. జియో ఇన్ఫోకామ్ ఐపీఓ సంబంధించి అప్డేట్లు ఉంటాయని ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa