హాసన్ మాజీ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచార కేసులో దోషిగా తేలిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2021లో హాసన్ జిల్లాలోని గన్నికాడ ఫామ్హౌస్లో 48 ఏళ్ల ఇంటి పనిమనిషిపై రెండుసార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో ఆగస్టు 1, 2025న రేవణ్ణను దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పు విన్న వెంటనే కోర్టు గదిలోనే ప్రజ్వల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ కేసులో విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) 123 ఆధారాలతో 2,000 పేజీల ఛార్జ్షీట్ సమర్పించింది. ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలతో పాటు, రేవణ్ణ తన మొబైల్లో బాధితురాలిపై జరిగిన దాడిని రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న ప్రారంభమైన విచారణ, కేవలం 14 నెలల్లో పూర్తి కాగా, జూలై 18న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు, శనివారం మధ్యాహ్నం 2:45 గంటలకు శిక్షను ఖరారు చేయనుంది.
ప్రజ్వల్ రేవణ్ణపై మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది, వీటిలో మూడు అత్యాచార కేసులు, ఒక లైంగిక వేధింపు కేసు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో 2,900కు పైగా వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలో జేడీఎస్ పార్టీ రేవణ్ణను సస్పెండ్ చేసింది. అరెస్ట్ భయంతో విదేశాలకు పారిపోయిన రేవణ్ణ, మే 31, 2024న జర్మనీ నుంచి తిరిగి వచ్చినప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టయ్యాడు.
నీడల్లో నీచ కృత్యాలు న్యాయస్థానం ఎదుట బయటపడ్డాయి. శనివారం శిక్ష ఖరారు సందర్భంగా రేవణ్ణ తనకు తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని వేడుకున్నాడు. ఈ కేసులో రేవణ్ణకు కనీసం 7 ఏళ్ల నుంచి గరిష్ఠంగా జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తీర్పు కర్ణాటక రాజకీయాల్లో మరింత చర్చనీయాంశం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa