ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు జిల్లాలో రహదారులకు మహర్దశ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 07:40 PM

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పలుచోట్ల జాతీయ రహదారుల నిర్మాణాలు, విస్తరణ పనులు చేపడుతున్నారు. అలాగే రాష్ట్ర రహదారుల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత రహదారులను అభివృద్ధి్ చేస్తున్న ప్రభుత్వం.. రాష్ట్ర రహదారుల అభివృద్ధిపైనా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో పలు రహదారులకు మహర్దశ పట్టనుంది. నెల్లూరు జిల్లాలోని కావలి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలో ఉండే రెండు రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా కొన్ని గ్రామాల్లో బైపాస్‌లు ఏర్పాటు చేశారు. అలాంటి చోట్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే పట్టణాలలో రహదారులను వెడల్పు చేయనున్నారు.


మరోవైపు జాతీయ రహదారి 167- బీని ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ నుంచి కడప జిల్లాలోని మైదుకూరు వరకూ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కందుకూరు, వలేటివారిపాలెం, పామూరు, సీఎస్ పురం మండలాల మీదుగా ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 190 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. అందులో భాగంగా మొదటి ప్యాకేజీ కింద ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి మాలకొండ వరకూ 45 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. కందుకూరు, బడేవారిపాలెం, వలేటివారిపాలెం, చుండి వంటి చోట్ల బైపాస్‌లు నిర్మించగా.. ఇటీవల ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభం కూడా అయ్యాయి.


అయితే బైపాస్‌ల నిర్మాణం సమయంలో ఆయా గ్రామాల్లోని కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే కొన్నిచోట్ల విస్తరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దెబ్బ తిన్న చోట్ల కొత్త రహదారులు, పట్టణాలలో విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది.


అందులో భాగంగా కందుకూరులోని క్లబ్ రోడ్డు కూడలి నుంచి ఓవీరోడ్డు బైపాస్ వరకూ, పామూరు రహదారిలోని కల్లూరి కోటయ్య కాలనీ నుంచి చెర్లో పాలెం కూడలి వరకూ రహదారిని విస్తరించనున్నారు. అలాగే బడేవారిపాలెం, వలేటివారిపాలెంలో సీసీరోడ్లు, బీటీ రోడ్లు నిర్మించనున్నారు. మొత్తం 12 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa