ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్.. ఆగస్టు 16 నుంచి ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:01 PM

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్ సందర్శించాలనుకునే వారికి అధికారులు తీపి కబురు అందించారు. ఈ సుందర ఉద్యానవనాన్ని ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచనున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి సోమవారం ఉద్యాన్ నిర్వహణ నిమిత్తం సెలవు ఉంటుందని తెలిపారు. సందర్శకులకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అనుమతి ఉంటుంది. గతంలో 'మొఘల్ గార్డెన్స్'గా పిలువబడే ఈ ఉద్యానవనాన్ని ఇటీవల 'అమృత్ ఉద్యాన్'గా పేరు మార్చారు. ఇది దేశంలోని అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.


అమృత్ ఉద్యానవనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సందర్శనలో భాగంగా బాలవాటిక, హెర్బల్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, సెంట్రల్ లాన్, సర్క్యులర్ గార్డెన్, లాంగ్ గార్డెన్ వంటివి వీక్షించవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి మొక్కకు ఒక క్యూఆర్ కోడ్ (QR Code) ఉంటుంది. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ మొక్క జాతి, దాని చరిత్ర గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది.


ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ విధానంలో..


అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునేవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాలలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ప్రవేశ రుసుము పూర్తిగా ఉచితం. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ బుకింగ్ చేసుకునే వారు.. 35వ ఎంట్రీ వద్దకు చేరుకున్నాక అక్కడే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. సందర్శకులు లోపలికి వెళ్లేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.


 మొబైల్స్, ఎలక్ట్రానిక్ కీలు, హ్యాండ్‌బ్యాగ్స్, వాలెట్స్, వాటర్ బాటిల్స్, పిల్లలకు మిల్క్ సీసాలు, గొడుగులు వంటి వాటిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇతర వస్తువులను నిషేధించారు. అధికారులు కొన్ని ప్రత్యేక తేదీలలో ప్రత్యేక వ్యక్తులకు ప్రవేశ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఆగస్టు 29న.. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడాకారులకు ప్రత్యేక ప్రవేశం కల్పిస్తారు. సెప్టెంబర్ 5న.. టీచర్స్ డే పురస్కరించుకుని ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రవేశ సదుపాయం ఉంటుంది.


ఈ ప్రత్యేక ప్రవేశ సదుపాయాలు సంబంధిత రంగాల వారికి గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా, వారిని ప్రోత్సహించే విధంగా ఉంటాయి. అమృత్ ఉద్యాన్ సందర్శన అనేది ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు, భారత రాష్ట్రపతి భవన్ పరిసరాల గొప్పదనాన్ని తెలుసుకునే అరుదైన అవకాశం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa