ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్-బంగ్లాదేశ్ వైమానికదళ ఒప్పందం.. అప్రమత్తమైన భారత్

international |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:29 PM

పాకిస్థాన్-బంగ్లాదేశ్ దేశాల మధ్య రహస్యంగా జరుగుతున్న ఒక వైమానిక ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత భద్రతా వర్గాల్లో కలకలం రేగుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు డ్రోన్ వార్‌ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లుగా ఆ నివేదిక వెల్లడించింది. ఇది భారత్‌కు.. ముఖ్యంగా తూర్పు సరిహద్దులో కొత్త భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అధికార వర్గాల నుంచి లీకైన నిఘా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ వైమానిక దళం బంగ్లాదేశ్ వైమానిక దళంతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19 వరకు రహస్యంగా చర్చలు చేపట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రహస్య సమావేశంలో ఇరు దేశాల వైమానిక దళ చీఫ్‌‌‌లు డ్రోన్ యుద్ధం, వ్యూహాత్మక కమ్యూనికేషన్లు, అంతరిక్ష కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్, ప్రపంచ రాజకీయ పరిస్థితులు మొదలైన విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్వార్మింగ్, అటానమస్ ఎయర్ కంబాట్ సిస్టమ్‌లకు కీలకమైన మాడ్యులర్, అన్‌మ్యాన్డ్ మిషన్ ట్రైనర్స్ సిమ్యులేటర్‌ల ఉమ్మడి అభివృద్ధిపై వీరు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.


ఇది మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ 1 పారా కమాండో బెటాలియన్‌కు ప్రత్యేక ఆయుధాలను బదిలీ చేయడం, బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ ఇవ్వడానికి చర్యలు, పాక్ నుంచి అబ్దాలీ స్వల్ప శ్రేణి క్షిపణిలను, తుర్కియే నుంచి బంగ్లాదేస్ యుద్ధ ట్యాంకులనూ కొనుగోలు చేయడంపై ఇరు దేశాలు ఒప్పంద కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయంగా కూడా ఇరు దేశాల మధ్య పలు చర్చలు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్‌ను పదవి నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


దీంతో భారత్ అప్రమత్తం అయింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రక్షణను మరింత పెంచడం, ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి భారత రక్షణ, సైనిక వర్గాలు చర్యలు తీసుకున్నాయి. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్‌కు తూర్పు సరిహద్దులో ఉంది. పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దులో ఉంది. ఈ రెండు దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే భారత్ రెండు వైపుల నుంచి సైనిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు డ్రోన్ టెక్నాలజీని అందించడం ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.


డ్రోన్‌ల ద్వారా సరిహద్దుల్లో నిఘా పెట్టడం, ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించడం వంటి చర్యలకు పాల్పడవచ్చని భారత్ ఆందోళన చెందుతోంది. ఈ కొత్త ఒప్పందం ప్రాంతీయ భౌగోళిక రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం ఈ పరిణామాలపై దృష్టి పెట్టి, తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa