ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టైలిష్ లుక్‌లో ఓవల్ క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రత్యక్షమైన హిట్‌మ్యాన్

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 11:06 PM

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్‌కు హాజరయ్యాడు. ది ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ మూడో రోజు ఆటను చూసేందుకు హిట్‌మ్యాన్.. వచ్చేశాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే రోహిత్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రోహిత్ శర్మ.. స్టేడియానికి వచ్చినట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీఐపీలా కాకుండా.. సాధారణ అభిమాని తరహాలోనే మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు రోహిత్.


కాగా ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత, ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్ చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడకుండానే వీడ్కోలు పలికాడు. రోహిత్ ప్రకటన వెలువడిన వారం రోజులకే స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఇంగ్లాండ్ టూర్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్ తగిలినట్లయింది.


ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాడు. కుటుంబంతో పాటు వెకేషన్‌కు వెళ్లాడు. తాజాగా డెనిమ్ షర్ట్, జీన్స్, తలకు క్యాప్‌తో రోహిత్ సింపుల్‌గా ది ఓవల్‌ స్టేడియానికి వచ్చాడు. హిట్‌మ్యాన్‌ను చూడగానే అక్కడున్న వారంతా సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అతడు కనిపించడంతో కెమెరాలన్నీ రోహిత్ వైపే తిరిగాయి. ఆ తర్వాత అతడు స్టాండ్స్‌ నుంచి మ్యాచ్ వీక్షించాడు.


కాగా ది ఓవల్ క్రికెట్ స్టేడియలో రోహిత్ శర్మకు మంచి గుర్తులు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ క్రితం సారి ఇక్కడ పర్యటించినప్పుడు ఈ స్టేడియంలో రోహిత్ అదరగొట్టాడు. 2021లో రెండో ఇన్నింగ్స్‌లో 256 బంతుల్లో 127 పరుగులు స్కోరు చేశాడు. అందులో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్.. 157 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. నాలుగేళ్ల తర్వాత రోహిత్ మళ్లీ ఈ స్టేడియానికి వచ్చాడు. అయితే ఈసారి మాత్రం సాధారణ అభిమానిలా..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa