ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎంలలో రూ. 500 నోట్ల పంపిణీ నిలిపివేతపై ఫేక్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 08:21 PM

ఏటీఎంల ద్వారా 500 రూపాయల నోట్ల జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సందేశం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్‌బీఐ అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది.2025 సెప్టెంబర్ 30 నాటికి ఏటీఎంల నుంచి రూ. 500 నోట్ల జారీని నిలిపివేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించిందని ఓ సందేశం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. 2026 మార్చి 31 నాటికి 90 శాతం, సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో ఈ నోట్ల పంపిణీ ఆగిపోతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 500 నోట్లను మార్చుకోవాలని, భవిష్యత్తులో ఏటీఎంలలో కేవలం రూ. 100, రూ. 200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కూడా అందులో ఉంది.ఈ వైరల్ సందేశంపై ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఆర్‌బీఐ అలాంటి సూచనలేవీ చేయలేదని, రూ. 500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. "సెప్టెంబర్ 2025 నాటికి ఏటీఎంల నుంచి రూ. 500 నోట్ల పంపిణీని నిలిపివేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరిందా? ఈ మేరకు వాట్సాప్‌లో వ్యాపిస్తున్న సందేశం పూర్తిగా అవాస్తవం. ఆర్‌బీఐ నుంచి అలాంటి ఆదేశాలు జారీ కాలేదు. రూ. 500 నోట్లు చెల్లుబాటులోనే కొనసాగుతాయి" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన పోస్టులో పేర్కొంది.గత నెలలో కూడా ఇలాంటి వదంతే సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అప్పుడు కూడా దానిని ఖండించామని అధికారులు గుర్తుచేశారు. కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారాన్నైనా నమ్మే ముందు ఆర్‌బీఐ లేదా పీఐబీ వంటి అధికారిక వర్గాల ద్వారా నిర్ధారించుకోవాలని, ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa